సాక్షి, గుంటూరు: రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని.. సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని వరుస అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘యూట్యూబర్ ప్రశ్న రావణ్, జర్నలిస్టు కేవీఆర్ మా పార్టీకి చెందినవారు కాకపోయినా వారిపై నమోదు చేసిన అక్రమ కేసులను వ్యతిరేకిస్తున్నాం. తప్పు చేస్తే కోర్టులో నిరూపించాలి. కేసుల మీద కేసులు పెట్టి వేధించడం చట్టవిరుద్ధం. ప్రశ్న రావణ్పై ఐదుసార్లు అరెస్ట్, బెయిల్, మళ్లీ అరెస్ట్ చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం.
..రిమాండ్ ఇవ్వని కోర్టులను దాటేందుకు యూఏపీఏ కేసు పెట్టడం న్యాయవ్యవస్థకే సవాల్. ఉగ్రవాదులపై ఉపయోగించే చట్టాన్ని ఓ యూట్యూబర్పై ప్రయోగించడం దారుణం. అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి వైఎస్సార్సీపీ లీగల్ సపోర్ట్ అందిస్తుంది. సాయి కృష్ణ, కాంతికుమార్, ప్రశ్న రావణ్, కేవీఆర్.. ఎవరు మా పార్టీ వాళ్లు కాకపోయినా అన్యాయానికి వ్యతిరేకంగా నిలుస్తాం.
బాధితులనే నిందితులుగా మార్చే ధోరణిని వైఎస్సార్సీపీ సహించదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే యూఏపీఏ.. అధికారాన్ని పొగిడితే రక్షణ అనే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సమస్యలను వదిలేసి సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది. మమ్మల్ని దూషించే వారిపై చర్యలు లేవు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులా?. జనవరి 31న నా ఇంటిపై జరిగిన దాడిపై నిందితుల అరెస్టు కోరుతూ ఈ నెల 29న డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇస్తాం. ఈ దుర్మార్గమైన పాలనను ప్రజలు గమనించి తగిన తీర్పు ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.


