కేసుల్లేని మంత్రులు ముగ్గురే | 136 criminal cases against 9 ministers including CM | Sakshi
Sakshi News home page

కేసుల్లేని మంత్రులు ముగ్గురే

Dec 10 2023 5:19 AM | Updated on Dec 10 2023 2:48 PM

136 criminal cases against 9 ministers including CM - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వంలోని 12 మంది అమాత్యుల్లో సీఎం రేవంత్‌రెడ్డి సహా తొమ్మిది మంది మంత్రులపై కలిపి మొత్తం 136 క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో తీవ్రమైన క్రిమినల్‌ కేసులు 50 ఉన్నాయి. ఇక తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నట్లు ఐదుగురు మంత్రులు ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫారమ్స్, తెలంగాణ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సహా 12 మంది మంత్రుల అఫిడవిట్ల «ఆధారంగా వారి నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు తదితర అంశాలపై సమీక్ష చేపట్టిన ఏడీఆర్‌ సంస్థ శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. 

రేవంత్‌ తర్వాత ఉత్తమ్, పొన్నం 
పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తర్వాతి స్థానంలో 11 కేసులతో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఆయన తర్వాత 7 కేసులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, 6 కేసుల చొప్పున ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దాసరి అనసూయ సీతక్క, 5 కేసుల చొప్పున ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, 3 కేసుల చొప్పున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎౖMð్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. 

సీతక్క మినహా అందరూ కోటేశ్వరులే 
మంత్రివర్గంలోని సీఎం సహా మొత్తం 12 మంది మంత్రుల్లో 11 మంది కోటీశ్వరులే ఉన్నారు. ఏడీఆర్‌ విశ్లేíÙంచిన 12 మంది మంత్రుల ఆస్తుల లెక్క చూస్తే.. రూ.433.93 కోట్ల విలువైన ఆస్తులతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అత్యధికంగా ఆస్తులు ఉన్న మంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు.

కాగా 10 మంది మంత్రులు తమకు అప్పులు ఉన్నాయని ప్రకటించగా....అప్పుల జాబితా లోనూ రూ.43.53 కోట్లతో మంత్రి పొంగులేటి టాప్‌లో ఉన్నారు. ఆస్తుల విషయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తర్వాత రూ.46.66 కోట్లతో దామోదర రాజనర్సింహ, రూ.39.55 కోట్లతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రూ.30.04 కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. అయితే రూ.82.83 లక్షల ఆస్తులతో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement