పెద్దపల్లి: పర్యావరణం, జీవజాతులకు హాని కలిగించే ప్లాస్టిక్ వస్తుసామగ్రి వినియోగం జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగుతోంది. పర్యావ రణ పరిరక్షణ కోసం ప్రభుత్వం నిషేధించిన పలు రకాల ప్లాస్టిక్ వస్తువులు, సంచులు మార్కెట్లలో ఇ ప్పటికీ దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల అలసత్వంతో నిషేధం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. నిత్యం తనిఖీలు చేపట్టి నిషేధాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగితాలకే పరిమితం..
ఒకసారి వినియోగించి4 పడేసే ప్లాస్టిక్ వస్తువుల్లో 120 మైక్రాన్ల లోపు మందం కలిగిన ప్లాస్టిక్ సంచులు, పీవీసీ బ్యానర్లపై 2022 నుంచి నిషేధం అమల్లో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కాకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప లు పట్టణాల్లో యథేచ్ఛగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తున్నప్పటికీ అధికారులు కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను విక్రయించే వారిపై రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించాలి. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
నిషేధిత జాబితాలో ఉన్నవి..
ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్నాక్ బాక్సులు, 120 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ సంచులు, పీవీసీ బ్యానర్లు, ఐస్క్రీమ్ స్టిక్స్, జెండాలు, చాక్లెట్లకు వాడే పుల్లలు, ఐస్క్రీమ్ పుల్లలు, థర్మాకోల్ షీట్లు తదితరాలను అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు.
అడపాదడపా దాడులు
పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయాల పరిధిలో సిబ్బంది షాపింగ్ కాంప్లెక్స్ మార్కెట్లలో అడపాదడపా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు.. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.500 నుంచి రూ.5,000 వరకు జరిమానా వేసి మామ అనిపిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. హోటళ్లలో సైతం ప్లాస్టిక్ కప్పులు వాడుతున్నప్పటికీ అధికారులు చూసీచూడకుండా ఉండడంపై పలు విమర్శలు వస్తున్నాయి. కాగితాలకే కాకుండా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు.
జిల్లాలో ఇలా..
రామగుండం నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రధాన పురపాలక ప్రాంతాల్లో నిషేధిత ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. పూలు, పాలు నుంచి టిఫిన్లు, పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్ వరకు అన్నింటినీ ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది. ఒక్కో దుకాణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం భారీగా కనిపిస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తున్నా, అమలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.
రోజూ వెలువడే వ్యర్థాలు(టన్నుల్లో)
పెద్దపల్లి 220
సుల్తానాబాద్ 95


