పండుగలు, వేడుకలు, శుభ, అశుభ కార్యక్రమాలు ఏవైనా సరే ఆ ఊళ్లో మద్యం సీసాలే కనిపించే వి.. ‘నాలుగు బెల్ట్షాప్లు.. ఆరు గొడవలు’ అన్న చందంగా ఉండేది ఆ పల్లెల పరిస్థితి. ఇప్పుడాపరిస్థితి మారుతోంది. ‘మద్యం వద్దు.. మా కుటుంబాలు బాగుండాలి’ అని గ్రామస్తులే ముందుకొచ్చి తీర్మానాలు చేసుకుంటున్నారు.. వెరసి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారిన పడడంలేదు. గ్రామసభ వేదికగా మద్యపాన నిషేధానికి నిర్ణయం తీసుకుంటున్నాయి. సుల్తానాబాద్ మండలం మంచిరామి, మంథని మండలం దుబ్బపల్లి, గాజులపల్లి, మల్లేపల్లి, ఎక్లాస్పూర్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
సాక్షి పెద్దపల్లి:
మద్యం అనేది వ్యసనమే కాదు.. అనేక కుటుంబాల కన్నీటి కథ. పచ్చని బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్న మృత్యువు. ఈ చీకటిని చీల్చుకుంటూ కొన్ని గ్రామాలు ధైర్యంగా ముందడుగు వేస్తున్నాయి. ‘మా ఊళ్లో మద్యం వద్దు’ అంటూ ఏకగ్రీవంగా తీర్మానించి భవిష్యత్కు బాటలు వేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మంథని మండలం దుబ్బపల్లి, గాజులపల్లి, మల్లేపల్లి, ఎక్లాస్పూ ర్, సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామాలు మద్యపానం నిషేధిస్తూ ఏకతాటిపైకి వచ్చాయి.
పచ్చని కాపురాల్లో ‘మత్తు’చిచ్చు
జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం మత్తులో జరుగుతున్న అనర్థాలు కోకొల్లలు. మద్యానికి బానిసైన కొడుకు పింఛన్ డబ్బుల కోసం ఇటీవల కన్నతండ్రినే హత్యచేశాడు. మద్యం తాగి వాహనాలు నడపడం, కుటుంబ సభ్యులపై దాడులు చేయడం, చిన్నపాటి గొడవలు ఘర్షణలకు దారితీయడం, చివరకు ప్రాణాలు పోవడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఇవి అనేక కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నాయి. భర్త సంపాదన మద్యానికి వెచ్చించడంతో మహిళలు, పిల్లలు పూటగడవని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను చూసిన మహిళా సర్పంచులు.. తమ ఊళ్లో బెల్ట్షాప్లకు చోటులేదంటూ నిర్ణయించుకున్నారు.
గ్రామసభలోనే నిర్ణయం.. ఊరంతా ఒకేమాట
మద్యం విక్రయంతో వచ్చే ఆదాయం కన్నా దాని వల్ల కుటుంబాలు కోల్పోతున్న ప్రశాంతత, ఆరోగ్యం, ఆర్థిక భద్రతే ఎక్కువని గుర్తించిన గ్రామాలు ఒక్కొక్కటిగా మేల్కొంటున్నాయి. ‘మా గ్రామంలో మద్యం అమ్మకాలు వద్దు.. బెల్ట్షాపులు ఉండకూడదు’ అని తీర్మానిస్తున్నాయి. ఉల్లంఘించిన వారికి భారీజరిమానా, సామాజిక బహిష్కరణ వంటి హెచ్చరికలు జారీచేస్తున్నాయి. యువత పెడదోవ పట్టకుండా, భవిష్యత్ అంధకారం కాకుండా కాపాడుకోవడమే దీని ఉద్దేశమని చాటిచెబుతున్నాయి.
అధికారులు మద్దతు ఇస్తేనే..
మద్యం రహిత గ్రామాలను తీర్చిదిద్దడంలో ప్రజలదే ప్రథమ పాత్ర అయినా.. పోలీస్, ఎకై ్సజ్ అధికారుల మద్దతు ఉంటేనే ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది. నిషేధాన్ని ఉల్లంఘించేవారిపై తక్ష ణమే కఠిన చర్యలు తీసుకోవాలి. చైతన్యం చూపుతున్న పల్లెవాసులను అభినందించి ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గ్రామస్తులకు ఫిర్యా దు చేసేందుకు సులభమైన మార్గాలు కల్పించాలి. ఇలా చేస్తే మరిన్ని పల్లెలకు స్ఫూర్తిగా మారుతాయి.
బెల్ట్షాపులే అసలు సమస్య!
ఇంటి చెంత, వీధిచివరన, చిన్నషాపుల మాటున మద్యం లభిస్తోంది. దీంతో మద్యానికి అలవాటు పడుతున్న వారిసంఖ్య పెరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకై ్సజ్ అధికారులు లిక్కర్ సేల్స్పైనే దృష్టి పెట్టకుండా, బెల్ట్షాపులపై ఉక్కుపాదం మోపితేనే మార్పు శాశ్వతంగా నిలుస్తుంది.
ఆ ఊళ్లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం
గ్రామపంచాయతీల ఏకగ్రీవ తీర్మానాలు
మంచిరామి, దుబ్బపల్లి, గాజులపల్లి, మల్ల్లేపల్లి, ఎక్లాస్పూర్ ఆదర్శం


