పెద్దపల్లి: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకుంటున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు సాగునీరు సమృద్ధిగా అందుతోంది. జిల్లాలోని దాదాపు అన్నిచెరువులు, కుంట లు, జలవనరులు జలకళ సంతరించుకున్నట్లు ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వర్షాలు ఇలాగే కొనసాగితే జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులు, కుంటలు కూడా పూర్తిస్థాయిలో వరదనీటితో నిండే అవకా శం ఉందని వివరించారు. చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. భారీవర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీవర్షాలతో చెరువులు, కుంటలు నిండి వాగులు, వంకలు పారుతుండడంతో సాగునీటికి ఢోకాలేని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జోరందుకున్న వ్యవసాయ పనులు
వర్షాలు కురుస్తుండడం, మానేరు, హుస్సేమియావాగు జలకళ సంతరించుకోవడంతో జిల్లావ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు వేగవంతంగా కొనసాగుతుంది. జిల్లాలో ఈసారి 2 లక్షల 78 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని అంచనా వేయగా.. 2లక్షల 45 వేల 085 ఎకరాల్లో సాగు చేశారని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు.


