రెండుసార్లు రెండేళ్లు..
తర్వాత నాలుగేళ్లు.. ఇప్పుడు..?
గోదావరిఖని: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల జోష్ మొదలైంది. ఈసారి ఎలా గెలవాలనే దానిపై వివిధ యూనియన్లు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. చివరిసారిగా 2023 డిసెంబర్ 23న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించగా, ఏఐటీయూసీ గెలుపొందింది. తొమ్మిది నెలల అనంతరం యాజమాన్యం గుర్తింపుపత్రంత్రా అందజేసింది. అప్పట్నేంచే గుర్తింపు యూనియన్గా కొనసాగుతోంది. ఈ లెక్కన సెప్టెంబరు 8వ తేదీతో గుర్తింపు యూనియన్ గడువు రెండేళ్లు ముగుస్తుంది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో అన్నికార్మిక సంఘాలను చర్చలు, కార్యక్రమాలకు ఆహ్వానించాలనే డిమాండ్ మొదలైంది. గడువు నెలరోజులే మిగిలి ఉండటంతో ఆర్ఎల్సీ, సింగరేణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
హోరాహోరీ పోరులో..
సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన 2023 డిసెంబర్లో నిర్వహించిన ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ గెలుపొందాయి. సింగరేణిలో సుమారు 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారంపై గుర్తింపు, ప్రాతినిధ్యం సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
1998లో సింగరేణిలో మొదటి ఎన్నికలు
సింగరేణిలో అసవసర సమ్మెలు తగ్గించేందుకు అప్పటి సీఎం తొలిసారి 1998 సంవత్సరంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఏఐటీయూసీ అత్యధిక సందర్భాల్లో గెలిచింది. బీఆర్ఎస్ హయాంలో దాని అనుబంధ టీబీజీకేఎస్ రెండుసార్లు గెలుపొంది సుమారు పదేళ్లపాటు గుర్తింపు హోదాతో అనేక ఒప్పందాలు చేసుకుంది.
ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏఐటీయూసీ మినహా మిగతా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాయి.
గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించిన ఆదిలో రెండుసార్లు రెండేళ్లు, తర్వాత నాలుగు సార్లు నాలుగేళ్ల కాలపరిమితి ఉంది. ప్రస్తుతం రెండేళ్ల గడువు ఉండగా.. దానిని నాలుగేళ్లకు పెంచాలని ఏఐటీయూసీ కోరుతోంది. 2017లో రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు పొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాలుగేళ్లు కావాలని డిమాండ్ చేసింది. వివిధ కారణాలతో ఐదేళ్లపాటు గుర్తింపు సంఘంగా కొనసాగింది.
సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలు?
పోటీకి సిద్ధమవుతున్న వివిధ యూనియన్లు
నాలుగేళ్ల కాలపరిమితికి ఏఐటీయూసీ డిమాండ్
సెప్టెంబరుతో ముగియనున్న ప్రస్తుత ‘గుర్తింపు’ గడువు


