గత అనుభవాలపై ప్రజల్లో ఆందోళన
ఉధృతంగా గోదావరి, మానేరు, బొక్కలవాగు ప్రవాహం
వీడని వర్షం..బ్యాక్ వాటర్పై కలవరం
మంథని వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
మంథనిని ఆనుకొని ప్రవహించే బొక్కల వాగు ఉధృతి
మంథని: నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలు, వరదలు మంథని డివిజన్ ప్రజలను కోలుకోలేని దెబ్బ తీశా యి. గోదావరి, మానేరుతో పాటు బొక్కలవాగు ఉప్పొంగడంతో బ్యాక్వాటర్ మూలంగా భారీనష్టం వాటిల్లింది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు మొదలు రూ.10 లక్షల వరకు నష్టాన్ని కలిగించా యి. అంతటి నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి పైసా పరిహారం అందలేదు. ఆ చేదు జ్ఞాపకాలు ఈ ప్రాంత ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అయితే రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ముప్పు పొంచి ఉందా? అనే ఆందోళన ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా బ్యారేజీ గేట్లు ఎత్తడంతో పెద్దగా నీరు నిలిచే అవకాశం లేదు. అయితే కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదలడం, ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదిలే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఽఅధికారులు హెచ్చరికలు చేశారు. పార్వతీ బ్యారేజీ లో 74 గేట్లు ఎత్తి ఉంచడంతో మంథని సమీపంలోని గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీ నికి తోడు మానేరు, బొక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద ప్రభావం పెరిగే అవకాశం ఉంది. మంథని డివిజన్లో ఇప్పటికే పలు చెరువులు, కుంటలు మత్తడి పారుతున్నాయి. నదుల ఉరకలేస్తుండటంతో తాజా వరద తోడైతే మంథని మున్సిపాలిటీతో పాటు తీర ప్రాంత పల్లెలు, పంట పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది.


