ఓదెల: ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మల్లికార్జున స్వామి, సీతారామచంద్రస్వామి, నందీశ్వరులను దర్శించుకున్నారు. ఒగ్గుపూజాలతో పట్నాలు వేసి బోనాలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమరస్వామి ఏర్పాట్లు చేశారు.
ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలి
రామగుండం: ఆర్టిజన్ కార్మికులకు పూర్వపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఏపీఎస్ఈబీ) సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వాగునాయక్ అన్నారు. మల్యాలపల్లి సబ్స్టేషన్ వద్ద ఐదురోజులుగా ఆర్జిజన్ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి సంఘీభా వం తెలిపారు. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. దీక్షలో ఆర్టిజన్ కార్మికులు కొంకటి శ్రీనివాస్, వడ్డెపల్లి సురేష్, లగిశెట్టి మధు, ఆవుల మహేశ్, దుర్గం విశ్వనాథ్, బోరె శ్రీని వాస్, సందీప్, ప్రణయ్, జనార్దన్, రమేశ్, తేజ, కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిలో..
పెద్దపల్లిరూరల్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ విద్యుత్ ఆర్టిజన్లు పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని విద్యుత్ సర్కిల్ ఆఫీసు వద్ద చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం ఐదోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్, ఎండీ ఖాజా, ప్రశాంత్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నేడు మంథనిలో మంత్రి శ్రీధర్బాబు పర్యటన
మంథని: మంథని నియోజకవర్గంలో సోమవా రం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటించనున్నారు. మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంథనిలోని శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. ప్రతిమ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించే బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభిస్తారు. శ్రీలక్ష్మీనారాయణ ఆలయం వద్ద 13వ వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం, రూ.1.98కోట్ల టూరిజం నిధులతో రావుల చెరువు కట్ట అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. మార్కెట్యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
జ్యోతినగర్: రామగుండం కార్పొరేషన్ జంగాలపల్లెలోని నృసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రోక్షణ సహిత ధ్వజస్తంభ, నవగ్రహ, నాగదేవత ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ వెంగల బాపు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాంట్రాక్టర్ ఏబీసీ రెడ్డి, కార్పొరేటర్ మారెల్లి రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ వెంగల పద్మలత, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


