సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి తన ప్రాణాలకు హాని ఉందని పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. విజయా రెడ్డి తల్లి, సోదరులు.. ఆస్తిక కోసం ఎంతకైనా తెగిస్తారని తన ఫిర్యాదులో పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది.
వివరాల ప్రకారం.. మూడు నెలల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయా రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, విజయారెడ్డి చనిపోయాక ఆస్తి వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో విజయా రెడ్డి తల్లి సహా ఆమె సోదరుడిపై సురేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్బంగా సురేందర్ రెడ్డి.. సొంత వాళ్లే నా కుటుంబాన్ని నాశనం చేశారు. నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదు. ఆస్తి కోసం వాళ్ల కుటుంబం మొత్తం వేధింపులకు గురి చేసింది. వాళ్లు చనిపోయిన 25 రోజులకే నన్ను కూడా ఆస్తి కోసం బెదిరించారు. నా అత్త అంటే విజయా రెడ్డి తల్లి, నా బామ్మర్ది చిరంజీవి, అతని భార్య వేధింపులు, ఆస్తి కోసం వాళ్లు ఒత్తిడి చేయటం వల్లే విజయా రెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది.
ఆస్తి కోసం నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారు. నా భార్య, పిల్లలు చనిపోయిన బాధలో నేనుంటే.. ఆస్తి కోసం నన్ను బెదిరించారు. ఆస్తి కోసం వాళ్లు ఎంతకు అయినా తెగిస్తారు. నేను చనిపోతే ఆస్తి మొత్తం వాళ్లకు వస్తుందన్న ఉద్దేశంతో వాళ్లు ఉన్నారు. నేను చనిపోతే నా ఆస్తులు నా తల్లిదండ్రులకు లేదా ట్రస్టుకు రాస్తాను. వారితో నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి’ అంటూ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. విజయా రెడ్డి భర్త గతంలో దుబాయ్లో ఉద్యోగం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. బోడుప్పల్లోని చెంగిచర్ల హరితవనం కాలనీలో నివాసం ఉంటున్న పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి (38), ఆమె కూతురు చైతన్య రెడ్డి (18), కొడుకు విశాల్ రెడ్డి (17) జనవరి 31న ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి తమ కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లిన ముగ్గురు.. అనంతరం సనత్నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. విజయ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేశారు.


