కోల్సిటీ(రామగుండం): నగర ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు యుద్ధప్రాతిపదికన వరద నీటికాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నా రు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం 3, 48, 49 డివిజన్లలో పర్యటించి మురుగునీటి కాలువలను పరిశీలించారు. స్వయంగా జేబీసీ యంత్రాన్ని నడుపుతూ ముళ్ల పొదలు, పిచ్చి చెట్లు తొలగించారు. మల్కాపూర్ శివారులో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి టీచర్స్ కాలనీ వరకు వరద నీటి కాలువ కాంక్రీట్ నిర్మాణం చేపట్టి నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.పలువురు కార్పొరేటర్లతో పాటు డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీవీరామన్, టీపీఎస్ నవీన్, వార్డు అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు.


