
మూడు దశాబ్దాలకు సరిపడా నిల్వలు
● భారీగా బొగ్గు నిక్షేపాలు గుర్తించిన ఎక్స్ప్లోరేషన్ విభాగం ● రామగుండంలో కొనసాగుతున్న ఉద్యోగుల అన్వేషణ
గోదావరిఖని: బొగ్గు నిల్వల గుర్తింపులో ఎక్స్ప్లోరేషన్(అన్వేషణ) విభాగంగా ముందుకు సాగుతోంది. కొన్ని గనుల్లో నిల్వలు అడుగంటిపోతుండడంతో అన్వేషణ వేగవంతం చేస్తోంది. ప్రధానంగా రామగుండం రీజియన్లోని ఆరు ప్రాంతాల్లో సర్వే చేస్తోంది. భూఉపరితలం నుంచి సుమారు 250 మీటర్ల లోతులో బొగ్గు పొరలు ఉన్నట్లు గుర్తించింది. ఇక్కడ 30 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించినా.. గనులకు అనుసంధానంగా వెలికితీసే విధానంపై సమాలోచనలు చేస్తోంది.
జీడీకే–1 ద్వారా వెలికితీత..
కొత్త టన్నెల్ ఏర్పాటు చేసి గుర్తించిన బొగ్గు నిల్వలను జీడీకే–1గని ద్వారా వెలికి తీసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. 1961లో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాగా, ప్రస్తుతంగా బొగ్గు వెలికితీత శరవేగంగా సాగుతోంది. భూగర్భగనుల్లో తట్టాచెమ్మస్ ద్వారా ప్రారంభమైన బొగ్గు ఉత్పత్తి.. ఇప్పుడు పూర్తిస్థాయి యాంత్రీకరణతో కొనసాగుతోంది. భూగర్భగనులతో పాటు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులు రావడంతో బొగ్గు వెలికితీతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఏటా 25 మిలియన్ టన్నులు వెలియి తీయగా.. ప్రస్తుతం 72 మిలియన్ టన్నులకు చేరుకుంది.
గోదావరి తీరంలో నిక్షేపాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామ శివారులో తొలిసారి బొగ్గు తవ్వకా లు 1959లో చేపట్టారు. రామగుండం రీజియన్లో తొలిసారి జీడికే–1వ గనిలో 24 మిలియన్ టన్నుల నిల్వలు గుర్తించారు. 1961 నుంచి 2025 ఏప్రిల్ వరకు 21 మిలియన్ బన్నుల బొగ్గు వెలికితీశారు. ఇంకా 12ఏళ్ల పాటు తవ్వేందుకు 3 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. చాలాభూగర్భ గనులు నిల్వలు అడుగంటి త్వరలోనే మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ఈక్రమంలో ప్రస్తుతం గోదావరి నది ఒడ్డున సమ్మక్క జాతర ప్రాంగణం, జీడీకే–5 ఓసీపీ, ఓసీపీ–2, అడ్రియాల ప్రాజెక్టు పోచమ్మ గుడికి వద్ద ఎక్స్ప్లోరేషన్ విభాగం ఆధ్వర్యంలో అన్వేషణ కొనసాగుతోంది.
250 మీటర్ల లోతులో నిక్షేపాలు..
గోదావరి నదీ తీరంలోని సమ్మక్క జాతర సమీపంలో సింగరేణి ఎక్స్ప్లోరేషన్ డ్రిల్లింగ్ ద్వారా బొగ్గు నిక్షేపాలు గుర్తిస్తోంది. 250 మీటర్ల లోతులో ఐదున్నర మీటర్ల, మూడు మీటర్ల వెడల్పుతో రెండు బొగ్గు పొరలను గుర్తించింది.
సింగరేణిలోనే కీలకం రామగుండం
ప్రస్తుతం రామగుండం రీజియన్లో ఆర్జీ–1,2,3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా కొనసాగుతున్నాయి. గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీల్లో ప్రాంతాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా నాలుగు ఓసీపీలతో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేస్తూ సింగరేణిలోనే రామగుండం రీజియన్ ప్రత్యేకత చాటుతోంది.
గనులకు అనుబంధంగానే..
జీడీకే–1వ గనికి అనుబంధంగా ఎక్స్ప్లోరేషన్ అన్వేషణ సాగుతోంది. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో బొగ్గు నిల్వలకు ఢోకాలేదు. వాటిని ప్రస్తుత గనులకు అనుబంధంగా ఎలా వెలికితీయాలనే అంశంపై శోధన చేస్తున్నాం. హైవాల్ టెక్నాలజీ ద్వారా జీడీకే–1వ గనిలో బొగ్గు వెలికితీసే వీలుంది. – శివన్నారాయణ, డీజీఎం, ఎక్స్ప్లోరేషన్

మూడు దశాబ్దాలకు సరిపడా నిల్వలు

మూడు దశాబ్దాలకు సరిపడా నిల్వలు