సాక్షిప్రతినిధి,కరీంనగర్:
మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మండల మహిళా సమాఖ్యలను ఎంపికచేశారు. ఈ జాబితాలో ఉమ్మ డి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐదు మండల మహిళా సమాఖ్యలకు అవకాశం దక్కడం గమనార్హం. శని వారం రవాణామంత్రి పొన్నం ప్రభాకర్, సీ్త్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమాఖ్యల కు బస్సులు కేటాయించనున్నారు.
ఎన్ఆర్ఎల్ఎం సాయంతో..
నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్య లకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈ పథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లెవెలుగు) బస్సులు కొంటారు. ఈ బస్సుల ఆర్సీ బుక్లో మహిళా సమాఖ్య పేరుమీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. వీటి నిర్వహణ ఆర్టీసీ చూసుకుంటుంది. నెలనెలా రూ. 77,220 చొప్పున ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ యాజమాన్యం చెల్లిస్తుంది.
ఎంపికై న సంఘాలివే..
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో పెద్దపల్లి జిల్లాల్లో 9, రాజన్న సిరిసిల్లకు 9, కరీంనగర్కు 14, జగిత్యాలకు 15 సమాఖ్యలు ఉన్నాయి. ఇందులో శనివారం జగి త్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీచైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాతా సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు మంత్రుల చేతులమీదుగా కొత్త బస్సులు అందుకోనున్నాయి.


