● జిల్లాలో 49,572 మంది దరఖాస్తు
● ఎంపీడీఓ వద్ద అధికంగా పెండింగ్లో దరఖాస్తులు
● తిరస్కరించినవి–140
విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవరకు కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదు. కొత్తగా దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు ఈ నెల 7వ తేదీ నుంచి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, గీతకార్మిక, మత్స్యకార, దివ్యాంగ, చర్మ, డప్పు కళాకారులు మొత్తం 49,572 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో నమోదుకాని దరఖాస్తులు ఎంపీడీఓల వద్ద వేలాదిగా ఉన్నాయి. వేల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (డబ్ల్యూఈఏ)ల వద్ద 33,199, ఎంపీడీఓల వద్ద 13,360, అసిస్టెంట్ సోషల్ వేల్పేర్ అధికారి ( ఏఎస్డబ్ల్యూఓ)ల వద్ద 353, మత్య్సశాఖ అధికారి వద్ద 52 , చేనేత, జౌళిశాఖ డీడీ వద్ద 23, తహసీల్దార్ల వద్ద 56, జిల్లా అధికారుల వద్ద 392 పెండింగ్లో ఉన్నాయి. 140 దరఖాస్తులు తిరస్కరించారు. 1597 దరఖాస్తులను మాత్రమే ఎంపీడీఓలు ఆమోదించారు.


