జియ్యమ్మవలస రూరల్: మండలంలోని అలమండ పంచాయతీ నిడగల్లు గూడ గ్రామానికి చెందిన బిడ్డిక సుబ్బారావు (42) మద్యానికి బానిసై రోజంతా మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడని భార్య గౌరి, కుమారుడు ప్రదీప్ మందలించడంతో మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం గడ్డి మందు తాగేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా, అక్కడ వైద్యులు చికిత్స అందించి పరిస్థితి విషమంచడంతో మెరుగైన చికిత్స కోసం చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేశారు. ఈ మేరకు 108లో తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో సుబ్బారావు మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య కుమారుల ఫిర్యాదు మేరకు జియ్యమ్మ వలస ఎస్సై ఎన్.ప్రశాంత్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
దుర్గాదేవి గుడిలో చోరీ
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి ఆటో స్టాండ్ వద్ద ఉన్న దుర్గాదేవి ఆలయంలో సోమవారం తెల్ల వారు జామున హుండీ చోరీకి గురైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై పెదమానాపురం పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిసర ప్రాంతాలను శీలించినట్లు తెలిపారు. హుండీలో సుమారు రూ.20 వేల వరకు భక్తులు వేసిన నగదు ఉంటుందని చెప్పారు. ఈ విషయమై పెదమానాపురం ఎస్సై కళాధర్ వద్ద ప్రస్తావించగా దొంగలు ఎటువైపు నుంచి వచ్చారో తెలియడానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆటోస్టాండ్ వద్ద తెల్ల వారు జామున ప్రయాణికుల కోసం ఉంచిన ఆటోలో కొంత నగదు రెంచీలు దొంగలు తీసుకుని పోయినట్లు ఆటో డ్రైవర్లు చెబుతున్నారు.
కాలువలో పడి బాలిక మృతి
గరుగుబిల్లి: బట్టలు ఉతికేందుకు వెళ్లిన బాలిక తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధానకాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందింది. ఈ సంఘటన గరుగుబిల్లి మండలంలోని దళాయివలస పంచాయతీ మధుర శివరాంపురం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల నిషా(15) గ్రామ సమీపంలోని కాలువ వద్ద బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. కాలువ ప్రాంతానికి వెళ్లిన కుమార్తె ఇంటికి చేరుకోక పోవడంతో కాలువ ప్రాంతంలో పరిశీలించగా అందులో పడి మృతి చెందిందని నిర్ధారణకు వచ్చిన తండ్రి రాజు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. కొద్దిసేపటి అనంతరం బాలిక మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తె నిషాకు మతిస్థిమితం లేదని తండ్రి చెప్పాడు. తమకు ఉన్న ఇద్దరు కుమార్తెల్లో పెద్దకుమార్తె నిషా చిన్న వయస్సులోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రాజు, ఇందుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఫకృద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


