● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపు
● ‘అనే నేను’ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం
విజయనగరం గంటస్తంభం: దేశ స్వాతంత్య్ర స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశ నిర్మాణంలో భాగస్వాములు ‘అనే నేను’ ప్రచార కార్యక్రమాలను ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రజలు కేవలం ప్రేక్షకులుగా కాకుండా దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించేలా కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆగస్టు 14న జిల్లా వ్యాప్తంగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలు తమ ఇళ్ల వద్ద లేదా ప్రముఖ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అలాగే ప్రభుత్వ భవనాలు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య కూడళ్లను జాతీయ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ‘అనే నేను’ కార్యక్రమాన్ని నిర్వహించి, దేశ భవిష్యత్తు కోసం తాము చేయగలిగే కృషిపై విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. యువత, విద్యార్ధులు, ప్రముఖలు, క్రీడాకారులు, పౌరులు జాతీయ జెండాను చేతబట్టి ‘అనే నేను...దేశ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను’ అంటూ 30 నుంచి 60 సెకన్ల స్వీయ వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు. అభివృద్ధి చెందిన భారత్, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆలోచిద్దాం..ఆచరిద్దాం..అభివృద్ధి చెందిన భారత్ను నిర్మిద్దాం అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ పిలుపునిచ్చారు.


