● పశువుల అక్రమ రవాణా
బొబ్బిలి: పశువుల రవాణా గుట్టు చప్పుడు కాకుండా కాదు.. బహిరంగంగా తరలిస్తున్నారు. ఒడిశా నుంచి పార్వతీపురం అక్కడి నుంచి పట్టణం గుండా పశువులను వధ శాలకు జోరుగా తరలిస్తున్నారు. వీటిని నెల్లూరు తరలిస్తున్నట్టు చెబుతున్నా ఎక్స్పోర్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్వతీపురం, ఒడిశా నుంచి పశువులను చిన్న వాహనాల్లో తరలించడంతో అవి ఆకలి, దాహానికి అలమటించడం బయటకు కూడా కనిపిస్తోంది. చిన్న వాహనంలో ఐదారు పశువులను తరలిస్తున్నా అటు పోలీసులు కానీ, ఇటు ఇతర శాఖల అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. బొబ్బిలి సంత ఉండేటప్పుడు అక్కడి నుంచి తరలించేవారు. ఇప్పుడు పట్టణ శివారు గుండా తరలిస్తూ అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల్లోకి వీటిని మార్చేందుకు రామభద్రపురం, బొబ్బిలిలోని రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఓ వైపు ఎస్పీ అన్ని దారులూ మూసేశామని చెబుతున్నా అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి సెలవు దినాల్లోనూ, పండగ రోజులు, ప్రముఖుల పర్యటనల సమయాలను ఎంచుకుని మరీ రవాణా జరుపుతున్నారు. అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.


