● నమోదుకు ఈ నెల 15 చివరి తేదీ
● జిల్లా విద్యాశాఖ అధికారి
యూ.మాణిక్యం నాయుడు
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజ్ఞాన, సాంకేతిక మండలి (ఏపీసీఓఎస్టీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 32వ జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ–2026)కు సంబంధించిన ప్రాజెక్టుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థుల నమోదును తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను అధికారిక వెబ్సైట్ లో ‘స్టూడెంట్స్/చిల్డ్రన్ సైంటిస్ట్స్ అండ్ గైడ్స్’ విభాగం ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రతి ప్రాజెక్టులో ఇద్దరు విద్యార్ధులు మాత్రమే పాల్గొనాలి. ఒకరిని ‘గ్రూప్ లీడర్’గా, మరొకరిని ‘గ్రూప్ మెంబర్’గా నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ శీర్షిక ఎంపిక చేసిన ఉపాంశానికి అనుగుణంగా ఉండాలి. నమోదు సమయంలో విద్యార్ధుల ఫోటోలు, ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలు, మొబైల్ నంబర్లు, ఈ–మెయిల్ చిరునామాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధన నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు ఈ జాతీయస్థాయి క్యాక్రమం ఎంతో తోడ్పడుతుందని డీఈఓ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల ఇందులో చురుగ్గా పాల్గొని అధిక సంఖ్యలో ప్రాజెక్టులను నమోదు చేయాలని, విజయనగరం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల నమోదుకు ఈ నెల 15వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నమోదు సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే జిల్లా కో–ఆర్డినేటర్ టి.రాజేష్ (ఫోన్: 9440444674), జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ జి.సన్యాసినాయుడు (ఫోన్:940009294)లను సంప్రదించాలని సూచించారు.


