● ఎస్ఎమ్ఏ వ్యాధి నివారణకు రూ.కోట్లలో ఇంజక్షన్
● డబ్బులు దోచుకునేందుకేనే ఇన్ప్లూయన్సర్స్
● సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారిన వైనం
● ఎవరినీ ఉపేక్షించేది లేదు: ఎస్పీ
విజయనగరం టౌన్:
స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ(ఎస్ఎంఎ) టైప్–1 అనే ఒక తీవ్రమైన, జన్యుపరమైన నరాల కండరాల వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్కు రూ.కోట్లలో ఖర్చుచేయాల్సి ఉంది. లక్షల్లోనే తట్టుకోలేని నిరుపేద కుటుంబాలకు కోట్లు ఖర్చు అంటే ఆశలు వదులుకోవాల్సిందే. అటువంటి వారికి పునర్విక విషయంలో ప్రపంచమంతా స్పందించడం విశేషం. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో పూల్బాగ్ కాలనీలో నివాసం ఉంటున్న లిటిల్ కృష్ణ అనే బాబు ఇదే వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే. ఆ బాబును కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు బాధ్యతగా సాయమందించారు. ఎందరో సమాజ సేవకులు రోడ్లెక్కి డబ్బులు సేకరించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది సభ్యులుగా ఉన్న కొందరు ఇన్ప్లూయన్సర్స్ ఇదే అదునుగా తీసుకుని డబ్బులు దోచుకోవడానికి తమ ప్రణాళికను సిద్ధం చేసుకుని పని పూర్తికానిచ్చేశారు. అందుకోసం వారు బాబు తల్లిదండ్రులను సైతం మభ్యపెట్టి, డబ్బులు వచ్చే మార్గాలను, ప్రజలను నేరుగా మోసం చేసే ప్రక్రియలో సగటు మనిషిని పూర్తిగా తమ మానవత్వానికి కల్పిత కథలు జోడించి, ఆ వీడియోలను వారు అనుకున్న పథకం ప్రకారం సోషల్ మీడియోలో పోస్టులు పెడుతూ బాబు ఇంజక్షన్కు కావాల్సిన కోట్లరూపాయల టార్గెట్ను పూర్తిచేసుకున్నారు.
బాబు తల్లిదండ్రుల నుంచి వాటా వసూలు
ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ బాబుకు కావాల్సిన ఇంజక్షన్కు కోట్ల రూపాయలను సమకూర్చడంలో తమకు రావాల్సిన వాటాను సైతం బాబు తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేసినట్లు భోగట్టా. చెక్కుల రూపంలో, నగదు రూపంలో సుమారు రూ. 50 లక్షలపైనే గుంజేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యోపాపమంటూ ఇప్పుడిప్పుడే ప్రజల్లో మంచి పేరుతెచ్చుకుంటున్న సింగర్స్, యాక్టర్స్ సైతం వీరు చేసిన పాపాలకు నెటిజన్లకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తంతు అంతా గమనించిన విజయనగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వ్యవహారాన్ని వెలికి తీయగా అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దోచుకున్న వారంతా రోజుకో కొత్త వెర్షన్లో సమాధానాలు చెబుతుండడంతో కథ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఒక్క విజయనగరమే కాదు..ఏకంగా ఉభయ రాష్ట్రాల్లోనే ఎంతో మంది వద్ద ఇన్ఫ్లూయన్సర్స్ భారీగా దోచుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకడు బైక్ అమ్మేశానని, మరొకరు ఇల్లు, కారు అమ్మేశానని, మరికొందరు తన బంగారం సైతం అమ్మేసి డబ్బులు పంపించానని కట్టుకథలే అల్లారా ? అసలు ఏది నిజం ? చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడడం, శవాలపైన డబ్బులు ఏరుకోవడం, ఈజీమనీ సంపాదించడంలో ఇటువంటి మోసాలకు పాల్పడడం పట్ల నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎవరికై నా సాయమందించాలంటే అందులో వాస్తవమెంత ఉందో కూడా అర్థం కాని పరిస్ధితి తలెత్తింది. ఇదిలా ఉంటే తాజాగా దత్తిరాజేరు మండలానికి చెందిన ఓ ఇద్దరు దంపతులు తమ బిడ్డకు ఇంజ్షన్ కోట్లలో ఖర్చవుతుందని సాయమందించాలని కోరారు. విజయవాడలో రిషి అనే చిన్నారి ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి చిన్నారుల పరిస్ధితి ఏంటి? ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే చేపట్టాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి సమస్య పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


