
పరీక్షలు ఉపాధ్యాయులకా? విద్యార్థులకా?
పాత పద్ధతే మేలు
ఎఫ్ఏ–1, 2, 3, 4 తో పాటు ఎస్ఏ–1, 2 పరీక్షల ఫలితాలను ప్రశ్నపత్రం మాదిరిగా మూల్యాంకన పుస్తకంలో నమోదుచేయడంతో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అదనంగా పాఠశాలలో సమయం కేటాయించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ పరీక్షల విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలోనే నిర్వహించాలి.
– బోశెట్టి రామారావు, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి, వీరఘట్టం మండలం
పని ఒత్తిడి
ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా తీసుకువచ్చిన మూల్యాంకన పుస్తక విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతున్న ఉపాధ్యాయులపై మూల్యాంక పుస్తకాలు ఇచ్చి అదనపు భారం మోపడం పద్ధతికాదు. ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ విధానాన్ని రద్దు చేయాలి.
– మజ్జి పైడిరాజు,
యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అడ్డుగోలు నిర్ణయాలు విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే క్లస్టర్ విధానం, పాఠశాలల విలీనంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. చాలాచోట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పరీక్షల్లో అసెస్మెంట్ పుస్తకాల విధానం అటు విద్యార్థులు, ఇటు గురువులను అయోమయానికి గురిచేస్తోంది. మూల్యాంకన భారం గురువులపై పడుతుండగా, విద్యార్థులు గతంలో రాసిన సమాధానాలే మళ్లీ చూసి రాసేలా తెచ్చిన విధానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతకూ ఈ పరీక్షలు ఉపాధ్యాయులుకా? లేదంటే విద్యార్థులకా? అంటూ ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నాయి. గతంలో పరీక్షల సమయంలో కాగితాలపై జవాబులు రాస్తే ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి దిద్దేవారు. ఇప్పుడు మూల్యాంకన పుస్తకాలను విద్యార్థులకు అందించారు.
ఇదీ పరిస్థితి....
జిల్లాలో 1504 సర్కారు బడులు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది సుమారు 62 వేల మంది విద్యా ర్థులు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపు కోసం ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహి స్తారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ప్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1,2,3,4గా నిర్ణయించారు. 2025–26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు, రెండు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మొదటి పరీక్షను ఈనెల 11న నిర్వహించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాల లు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ పరీక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి జరగాల్సి ఉంది. అసెస్మెంట్ బుక్ లెట్స్ పాఠశాలలకు చేరుకోవడం అలస్యం కావడంతో సోమవారం నుంచి నిర్వహిస్తున్నారు. జూన్, జూలై సిలబస్కు సంబంధించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై పరీక్షలు పెట్టారు.
ఏడాది మొత్తం ఇవే పుస్తకాల్లో
సమాధానాలు రాయాలి
సర్కారు బడుల్లో నిర్వహించే త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షలను ఎఫ్ఏ–1,2,3,4లుగా, ఎస్ఏ–1,2లుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను విద్యార్థులు మూల్యాంకన పుస్తకాలలో రాసేందుకు వీలుగా 1, 2వ తరగతులకు మూడు పుస్తకాలు, 3, 4, 5 తరగతులకు నాలుగు పుస్తకాలు చొప్పున, 6, 7వ తరగతులకు ఆరు పుస్తకాల చొప్పున, 8, 9,10వ తరగతులకు ఏడు పుస్తకాల చొప్పున అందజేశారు. ఏడాదిలో జరిగే అన్ని పరీక్షల వివరాలను ఈ మూల్యాంకన పుస్తకంలో నమోదు చేసేందుకు ఏడాదంతా ఈ పుస్తకాన్ని ఉపాధ్యాయులు భద్రంగా ఉంచాలి. అయి తే, గతంలో తెలుపు కాగితాలపై పరీక్షలు రాస్తే ఇంటికి తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారు. మార్కులు నమోదుతో పని పూర్తయ్యేది. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు. వీటిని భద్రపరచడం తలకుమించిన భారమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విద్యావ్యవస్థ గాడితప్పుతోందని విమర్శిస్తున్నాయి.
ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత ...
మూల్యాంకన పుస్తకాలపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మూల్యాంకనం పుస్తకాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆరు నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఆరు మూల్యాంకన పుస్తకాలు అందాయి. ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులు రాయాలి. పరీక్షలు రాసిన తర్వాత వాటిని దిద్ది అందులోనే ఉన్న ఓఎమ్మార్ షీట్లో మార్కులు వేయడంతో పాటు ఓఎమ్మార్ షీట్ను విద్యాశాఖ ఇచ్చిన యాప్లో ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాలి.
పరీక్షల సంస్కరణ పేరిట మూల్యాంకనం పుస్తకాల పంపిణీ
సమయం సరిపోదంటున్న ఉపాధ్యాయులు

పరీక్షలు ఉపాధ్యాయులకా? విద్యార్థులకా?

పరీక్షలు ఉపాధ్యాయులకా? విద్యార్థులకా?