
అన్నదాతకు అనర్హులు!
పీఎం కిసాన్ అర్హులు..
ఈ చిత్రంలోని మహిళ పేరు సీతమ్మ. పార్వతీపురం మన్యం జిల్లా. ఆమె భర్త చనిపోయారు. పాస్ పుస్తకం ఆయన పేరు ఉండిపోవడంతో మార్పు చేయాలని అనేక సార్లు అధికారులను కలిసి వేడుకుంది. ఇప్పుడు ఇదే కారణంతో అన్నదాత సుఖీభవ నిధులు కూడా ఆమెకు జమ కాలేదు.
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు గెమ్మల శంకరరావు. పాచిపెంట మండలం గరిసిగుడ్డి గ్రామం. అన్ని విధాలా అర్హులమైనప్పటికీ తమకు అన్నదాత సుఖీభవ నిధులు ఇప్పటి వరకు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కలెక్టరేట్కు సోమవారం వచ్చి అధికారులను కలిసి వేడుకున్నాడు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందిస్తామన్న కూటమి ప్రభుత్వం... వివిధ కారణాలు చూపుతూ లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఈ ఏడాదికి తొలివిడతగా కేంద్ర సాయం రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలను రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఆ మేరకు లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ ఒక్కో మొత్తంలో నగదు జమకావడంతో ఆశ్చర్యపోవడం రైతుల వంతైంది. జిల్లాలో ఈ–పంటను ప్రామాణికంగా తీసుకుని అన్నదాత సుఖీభవ పథకానికి 1,22,260 మంది రైతులు అర్హులుగా గుర్తించారు. లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించి, అభ్యంతరాలు కూడా స్వీకరించారు. వారందరికీ ఈ నెల 2వ తేదీన రూ.7 వేలు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చాలామందికి ఆ రోజు పీఎం కిసాన్ వాటా రూ.2 వేలే బ్యాంకు ఖాతాకు జమైంది. రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.5 వేలు అందకపోవడంతో అధికారులను సంప్రదించారు. రాత్రికో, రేపో జమవుతుందని తొలుత అధికారులు బదులిచ్చారు. పది రోజులు దాటినా నేటికీ ఆ మొత్తం లేదు. జాబితాలో పరిశీలిస్తే.. వివిధ కారణాలతో లబ్ధికి దూరమైనట్లు చూపుతోంది. దీంతో పీఎం కిసాన్కు అర్హులైన తాము.. అన్నదాత సుఖీభవకు ఎందుకు అనర్హులవుతామంటూ వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో అన్ని సంవత్సరాలూ రైతుభరోసా నిధులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం కింద ఏడాదికి 1.45 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ 20 వేల మందినిపైగా కుదించింది. ఇప్పుడు వారంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్లో సోమ వారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఇదే విషయమై అధిక శాతం వినతులు వచ్చాయి. ఆధార్ నమోదు సక్రమంగా లేకపోవడం, భూమికి వేరే ఆధార్తో లింకు కావడం, పాస్ పుస్తకంలో పేరు మారకపోవడం, మ్యుటేషన్, వెబ్ల్యాండ్లో సమస్యలతో కొంతమంది పథకానికి దూరమయ్యారు.
వీరంతా సాలూరు మండలానికి చెందినవారు. ఎస్టీ కుటుంబాలకు చెందిన రైతులు. వీరికి ప్రభుత్వం ఇచ్చిన సాగు పట్టాలు ఉన్నాయి. వాటి ఆధారంగా గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా పథకం వర్తించింది. ఏడాదికి రూ.13,500 చొప్పున వారి ఖాతాల్లో జమైంది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద రూ.2000 మాత్రమే వారి ఖాతాలకు పడింది. అన్నదాత సుఖీభవ వర్తించలేదు. ఆన్లైన్లో వన్బీలు చూపించడం లేదన్న కారణంతో పథకానికి దూరం చేసినట్టు అధికారులు చెబుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించి పథకం వర్తింజేయాలని కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో అధికారులకు గోడు వినిపించారు.
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల విచిత్ర పరిస్థితి
కేంద్రం వాటా నిధులు రూ.2 వేలే ఖాతాలోకి..
నేటికీ జమ కాని రాష్ట్ర వాటా రూ.5 వేలు
అధిక శాతం మందికి ఇదే పరిస్థితి

అన్నదాతకు అనర్హులు!

అన్నదాతకు అనర్హులు!