
పశు ఆరోగ్య సంచార వాహనాల్లో
● మందులు లేకుండానే గ్రామాలకు వెళ్తున్న వాహనాలు
● జిల్లాలో 13 సంచార పశు ఆరోగ్య
వాహనాలు
● రోజుకు ఒకటి రెండు గ్రామాల్లోనే వైద్య శిబిరాలు
● గతంలో 1962 నంబరుకు ఫోన్ రాగానే సంబంధిత గ్రామానికి వెళ్లి సేవలు
● ఏవీ నాటి సేవలు నేడు...
విజయనగరం ఫోర్ట్: పశు ఆరోగ్య సంచార వాహనాలు అలంకార ప్రాయంగా గ్రామాలకు వెళ్తున్నాయనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. పశువుల చికిత్సకు అవసరమైన మందులు లేకుండానే గ్రామాలకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాడి రైతులు పశువుల వైద్యానికి ప్రైవేటు మందుల దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. గతానికి భిన్నంగా పశు సంచార ఆరోగ్య వాహనాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. పశువుల వైద్యానికి సేవలు అందించేందుకు 1962 ట్రోల్ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజకవర్గానికి రెండు వాహనాలు ఉంచారు. రెండు మండలాలకు ఒక వాహనం చొప్పన వైద్య సేవలు అందించేవారు. 1962 ట్రోల్ ప్రీ నంబరుకు ఫోన్ రాగానే సంబంధిత గ్రామానికి వెళ్లి పశువులకు అవసరమైన వైద్యాన్ని వాహనం వద్దే అందించేవారు. శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తే దగ్గరలో ఉన్న ప్రాంతీయ పశు వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్స అందించి అనంతరం గ్రామానికి పంపించేవారు. విజయనగరం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు రెండు చొప్పన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు 13 ఉన్నాయి.
వాహనాల వివరాలు
గజపతినగరం నియోజకవర్గంలో – 2, చీపురుపల్లి నియోజకవర్గంలో – 2, బొబ్బిలిలో – 2, నెల్లిమర్లలో – 2, ఎస్.కోటలో – 2, విజయనగరంలో –1, రాజాంలో –2 చొప్పన పశు ఆరోగ్య సేవ వాహనాలు ఉన్నాయి.
మూగ జీవాలకు మందులు లేకుండానే..
మూగ జీవాల చికిత్స కోసం వచ్చిన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు మందులు లేకుండానే గ్రామాలకు వెళ్తున్నాయని పాడి రైతులు అంటున్నారు. మందులు లేకుండా గ్రామాలకు వెళ్లడంతో రైతులు పశు వైద్యుడు చెప్పిన మందులు ప్రైవేటు మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో రైతులకు చేతి చమురు వదులుతుంది. సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను గతంలో జీవీకే సంస్థ అందించేంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భవ్య హెల్త్ ప్రొవైడర్స్ సంస్థకు అప్పగించింది.
గతానికి భిన్నంగా..
సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల వివరాలను గతానికి భిన్నంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నెలకు 8 వేల నుంచి 9 వేల కిలోమీటర్ల వరకు ఒక్కో వాహనం సేవలు అందించేవి. ఇప్పడు వాహనాలు నెలకు 3 వేల కిలోమీటర్లు కూడా తిరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా రోజుకు రెండు మూడు గ్రామాల్లో వాహనం పెట్టి సేవలు అందిస్తున్నారు. ఒకే చోట వాహనాలను పెట్టడం వల్ల ఎక్కువసార్లు కేసుల కోసం తిరగాల్సిన పని తప్పుతుంది. అంతేకాకుండా కొన్ని వాహనాలు గ్రామాలకు వెళ్లడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
గంట్యాడ సంచార పశు ఆరోగ్య సేవ వాహనం
జిల్లాలో 4,75,805 పశువులు
జిల్లాలో 4,75,805 పాడి పశువులు ఉన్నాయి. ఇందులో 3,77,960 ఆవులు, 97,845 గేదెలు ఉన్నాయి. అదే విధంగా గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. పందులు 2,585, కోళ్లు 51,26,764 ఉన్నాయి.
మందులు వచ్చాయి..
సంచార పశువైద్యశాలల్లో మందుల కొరత ఉంది. అయితే ప్రస్తుతం మందులు వచ్చాయి. వాటిని సంచార పశు వైద్యశాలలకు అందజేస్తాం. ఇకపై ఇబ్బంది ఉండదు.
– డాక్టర్ దామోదర్రావు,జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు