
నాటు తుపాకీల వినియోగం
క్షణికావేశంలో హత్యలు
అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
ముమ్మరంగా కార్డన్ సెర్చ్
నాటు తుపాకీతో కాల్చడంతో ప్రాణాలు విడిచిన కొత్తవలస మండలం ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(ఫైల్)
●వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన గొర్లె ఈశ్వరరావు ఇంట్లో ఇటీవల పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. నాటు తుపాకీ లభ్యమైంది. గుడివాడ గ్రామానికి చెందిన రొంగలి బంగారయ్య వద్ద రూ.4,500కు ఈ తుపాకీని కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీంతో ఇద్దరినీ ఎస్.కోట గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు.
●ఇటీవల పార్వతీపురం మండలం రావికోన పంచాయతీ కొత్తవలస గ్రామంలో గ్రామీణ స్టేషన్ పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో కొర్ర సీతారాం అనే వ్యక్తి ఇంటి గడపలో నాటుతుపాకీని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
●బాడంగి మండలంలోని రావివలస, గదబవలస గ్రామాల్లో గతంలో నాటుతుపాకీతో దాడులకు పాల్పడడంతో బొబ్బిలి గ్రామీణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తుపాకుల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు.
●ఈనెల 5వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిఎస్.అప్పారావు నాటు తుపాకీతో కాల్చేశాడు. దీంతో సిమ్మ అప్పారావు అక్కడికక్కడే మరణించాడు. ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా వివాదం ఉంది. ఆ కోపంతోనే కాల్పులు జరిగాయి.
●గత నెల 28న ఎస్.కోట మండలం మూలబొడ్డవర గిరిజన పంచాయతీ శివారు చిట్టెంపాడు గిరిజన గ్రామానికి చెందిన సీదిరి రామును అదే గ్రామానికి చెందిన నాగరాజు నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ హత్య చోటు చేసుకుంది.
●కొన్నాళ్ల కిందట ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ పరిధి అడ్డతీగ గిరిజన గ్రామం వద్ద నాటు తుపాకీతో అడవిపందిని చంపే ప్రయత్నంలో తూటా తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు.
బాడంగి: మండలంలోని అల్లవానివలస పంచా యతీ శివారు గ్రామమైన రావివలసలో నాటు తుపాకీలున్నాయన్న సమాచారంతో బొబ్బిలి రూర ల్ సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో పోటీలసు లు శుక్రవారం ఇంటింటా సోదాలు జరిపారు. గతంలో రావివలసలోని ఎస్.టి.దొర లు, ఎరుకలవారు అడవిమృగాల నుంచి రక్షణ కోసం నాటు తు పాకులు వినియోగించేవారు. ఆ మేరకు గ్రామంలో సోదాలు చేశారు. అయితే, పోలీసులకు ఎలాంటి నాటుతుపాకీలు దొరకలేదు. గ్రామస్తులకు నాటుతుపాకీ కలిగి ఉండడం వల్ల కలిగే అనర్థాలు, చట్టపరంగా తీసుకునే చర్య లపై సీఐ అవగాహన కల్పించారు. ఈ సోదాలో సీఐతో పాటు బాడంగి, తెర్లాం, రామభద్రపురం ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.\
సాక్షి, పార్వతీపురం మన్యం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాటు తుపాకీల వినియోగం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వాటితో ప్రత్యర్థుల ప్రాణాలు తీస్తుండడం సామాన్య ప్రజానీకంతో పాటు పోలీస్ వర్గాలను కలవరపెడుతోంది. గతంలో పంటలను కాపాడుకోవడానికి.. అడవి జంతువుల నుంచి రక్షణకు ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు వీటిని అనధికారికంగా వాడేవారు. కొన్నాళ్లుగా వీటి జాడ లేదు అనుకుంటున్న సమయంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు నాటు తుపాకీ కాల్పులకు ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. అనుమతులు లేకుండా వీటిని వాడడం చట్ట విరుద్ధం అయినప్పటికీ.. కొందరు చట్టాన్ని విస్మరిస్తున్నారు.
నాడు రక్షణకు.. నేడు ప్రతీకారానికి!
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో అడవి పందుల నుంచి పంటలను కాపాడుకోవడానికి.. వాటిని వేటాడేందుకు నాటు తుపాకులు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కొన్ని మైదాన ప్రాంతాల్లో కూడా ఇవి లభ్యమవుతుండడం గమనార్హం. గంజాయి, సారా తరలింపు సమయంలో వన్య ప్రాణుల నుంచి రక్షణ కోసం నాటు తుపాకులను వెంట ఉంచుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు అక్రమ వ్యాపారానికి ఎవరూ అడ్డు రాకుండా ఆయుధాలను కూడా సమకూర్చుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు పచ్చని పల్లెల్లో పగలు, ప్రతీకారాలకు వీటిని వాడుతుండడం ఆందోళన కలిగించే అంశం. మందుగుండుకు ఉపయోగించే సామగ్రిని తుపాకీ గుళ్లుగా వాడుతున్నారు. తయారీలో సీసా పెంకులు, ఇతర పేలుడు పదార్థాలను వినియోగిస్తుండటం వల్ల మనిషికి తగిలిన వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఎన్నికల సమయంలోనే స్వాధీనం
ప్రస్తుతం అధికారులు నాటు తుపాకీలకు అనుమతులు ఇవ్వడం మానేశారు. సార్వత్రిక, స్థానిక ఎన్నికల సమయంలో లైసెన్సుడు తుపాకీలను పోలీస్ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ఆ సమయంలో నాటు తుపాకీల మీద కూడా నిఘా ఉంచేది. తాజా గా జరుగుతున్న కాల్పులతో పోలీసు శాఖ ఉలిక్కి పడింది.
రెండు జిల్లాల్లో ముమ్మరంగా కార్డన్ సెర్చ్
నాటు తుపాకులు, గంజాయి, సారా కట్టడికి అటు విజయనగరం, ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పోలీసులు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఎస్.కోట, వేపాడ, బాడంగి, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. వేపాడ, పార్వతీపురం ప్రాంతాల్లో కొన్ని చోట్ల అనధికారికంగా కలిగి ఉన్న నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
స్వచ్ఛందంగా అప్పగించాలి..
నాటు తుపాకుల ఏరివేత, సారా, గంజాయి కట్టడి లక్ష్యంగా గుర్తించిన ఏజెన్సీ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. నాటు తుపాకులు కలిగి ఉండడం, వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గిరిజనులకు అవగాహన కల్పించాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశించాం. తుపాకులు కలిగి ఉండడం ఇండియన్ ఆర్మీ యాక్టు ప్రకారం తీవ్రమైన నేరం. ఎవరి వద్దనైనా ఉన్నట్లయితే స్వచ్ఛందంగా అప్పగించాలి.
– వకుల్ జిందల్/ఎస్.వి.మాధవ్ రెడ్డి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీలు

రావివలసలో పోలీసు సోదాలు

ముమ్మరంగా కార్డన్ సెర్చ్