
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదేదీలేదు..
పార్వతీపురంటౌన్: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదేదీలేదని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జేఈఈ మెయిన్స్లో జాతీయస్థాయిలో 137, 900, 2,864వ ర్యాంకులు సాధించిన జోగింపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎస్.నందవర్దన్ నిహాల్, ఎస్.అఖిల్, పి.జగదీశ్వరరావును దుశ్శాలువతో సోమవారం సత్కరించారు. జేడీఈ అడ్వాన్స్ పరీక్షలో మంచి ప్రతిభ చూపాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బి.ధర్మారావు మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ విద్యార్థులకు రూ.40 వేలు ఖరీదుచేసే పుస్తకాలను ఉచితంగా అందించారన్నారు. పాఠశాల నుంచి 12 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాకుండా అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించారన్నారు.
దగా చేసిన కూటమి ప్రభుత్వం
పార్వతీపురం: గిరిజన నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని గిరిజన సంఘ జేఏసీ నాయకులు డి.సీతారాం, ఎ.చంద్రశేఖర్, జె.బంగార్రాజు, మల్లయ్య, మధుసూదనరావు ఆరోపించారు. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో వారు సోమవారం మాట్లాడారు. కురుపాం, పాలకొండ, పాడేరు నియోజకవర్గాల్లో జరిపిన ఎన్నికల ప్రచారంలో జీఓ నంబర్ 3ని పునరుద్ధరిస్తామని కూటమి నేతలు ప్రకటించారన్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారి పోస్టులను డీఎస్సీలో జనరల్ కేటగిరీలో కలపడంపై అభ్యంతరం తెలిపారు. జీఓ నంబర్ 3పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే ఆదివాసీ ఐక్య గిరిజన సంఘం తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
మళ్లీ వచ్చిన ఏనుగులు
భామిని: వంశధార నది ఆవల ఒడిశాలోని పురిటిగూడ, గౌరి గ్రామాలకు శుక్రవారం రాత్రి వెళ్లిన ఏనుగులు ఆదివారం రాత్రి భామిని మండలం బిల్లుమడ, జొన్నగుడ్డికి చేరుకున్నాయి. పంట పొలాల్లో సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పీఓ చొరవ.. కోలుకున్న బాలిక
● ఆశ్రమ పాఠశాల బాలికకు మెరుగైన వైద్యం
● విశాఖ కేజీహెచ్లో 50 రోజుల పాటు చికిత్స
● క్షేమంగా పాఠశాలకు చేరుకున్న చిన్నారి
సీతంపేట: ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి చొరవ ఫలించింది. సీతంపేట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిలకల అవనికి మెరుగైన వైద్యసేవలు అందాయి. ఊపిరితిత్తులు, కాలేయ సమస్యకు 50 రోజుల పాటు కేజీహెచ్లో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితి నుంచి బాలిక బయటపడింది. రేగిడి ఆమదాలవలస మండలం గదబపేట నుంచి పాఠశాలకు సోమవారం చేరుకుంది. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషిచేసిన పీఓకు బాలిక తల్లిదండ్రులు ఆయన కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర, డిప్యూటీ డీఎంహెచ్వో విజయపార్వతి, హెచ్చ్డబ్ల్యూఓ పాలక అమల తదితరులు పాల్గొన్నారు.
అభ్యంతరాల స్వీకరణ గడువు పెంపు
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రీయ బాలస్వస్థలో పోస్టులకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదేదీలేదు..