రూ.15 లక్షలు లంచం అడిగారు..
డీఎస్సీ పెద్ద స్కామ్...
నిర్బంధాలను లెక్కచేయక పోరాడిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
పాల్గొన్న నియోజకవర్గ
సమన్వయకర్తలు, ముఖ్యనేతలు
మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
వైఎస్సార్ సీపీ నిరసనలపై పోలీసులను ప్రయోగించిన ప్రభుత్వం
అడుగడుగునా అడ్డంకులు
సృష్టించిన వైనం
మాచర్ల, చిలకలూరిపేట, గురజాలలో నిరసన కేంద్రాల్లో పోలీసుల దౌర్జన్యం
డీఎస్సీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక నాకు సెక్రటేరీయెట్ నుంచి అంటూ ఫోన్ కాల్ వచ్చింది. రూ.15లక్షలు లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తామన్నారు. జిల్లాలో ఐదు పోస్టులు స్పోర్ట్స్ కోటాలో ఉండగా, నాది మొదటి పేరు. 15 జాతీయ క్రీడా పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొని రెండు సార్లు పతకాలు సాధించాను. లంచం ఇవ్వకపోవడంతో ఉద్యోగం ఇవ్వలేదు.
– ఊసా శబరీనాధ్, డీఎస్సీ అభ్యర్థి, చిలకలూరిపేట
నాకు కాల్ లెటర్ వచ్చింది. వన్ ఈస్ట్టు వన్ ప్రాతిపదికన లెటర్ వచ్చాక చరిత్రలో తొలిసారి ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారు. డీఎస్సీ 2025 నిర్వహణే పెద్ద స్కామ్. పోస్టు వచ్చిందని ఆనంద పడ్డాను. అయితే తుది జాబితాలో నా పేరు తొలగించారు. ఈ స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలి.
– కొమ్మతోటి అశోక్,
కావూరు గ్రామం, చిలకలూరిపేట మండలం
సాక్షి, నరసరావుపేట, చిలకలూరిపేట: డీఎస్సీలో అక్రమాలు చేసి నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పల్నాడు జిల్లావ్యాప్తంగా రిలే నిరసన దీక్షలు నిర్వహించారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపె తక్షణమే సీబీఐచే విచారణ చేయించాలని, దోషులను శిక్షించాలని, మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా రిలేదీక్షలు నిర్వహించారు. డౌన్డౌన్ లోకేష్.. అసమర్థ కూటమి ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసన దీక్షలలో ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సుధీర్ భార్గవ్రెడ్డిలు, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
అక్రమ కేసులు బనాయిస్తామంటూ...
అక్రమ డీఎస్సీ పోరు రోజురోజుకు ప్రజల్లోకి వెళుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వినియోగించి అడ్డుకునే కుట్రలకు తెరలేపింది. ఎక్కడిక్కడ పోలీసులను ప్రయోగించి రిలేదీక్షలను భగ్నం కలిగించేందుకు కుట్రలకు తెరలేపారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న నిరసన దీక్ష టెంట్ వేయకూడదని పోలీసులు దౌర్జన్యం చేశారు. బుధవారం రాత్రి 10 గంటల తరువాత సీఐ నబీర్బేగ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులపై బెదిరింపులకు దిగారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీక్ష జరిగే స్థలానికి వెళ్లగా పోలీసులు బెదిరించే ప్రయత్నాలు చేశారు. దీక్షలు చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పగా అంతే దీటుగా పిన్నెల్లి బదులిచ్చారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, మా అధినేత జగనన్న పిలుపు మేరకు నిరసన దీక్ష చేపట్టి తీరుతామని శిబిరం తొలగిస్తే రోడ్డుపై, రోడ్డుపై అరెస్టు చేస్తే పోలీసు స్టేషన్లో సైతం నిరసన తెలియజేస్తామని తేల్చిచెప్పారు.
మైక్ లాక్కెళ్లిన పోలీసులు
చిలకలూరిపేటలో పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజని ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. తొలుత మాజీ మంత్రి పార్టీ శ్రేణులు, నిరుద్యోగులు, యువతతో కలిసి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. అక్కడ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం దీక్ష శిబిరంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈక్రమంలో నిరాహార దీక్షను ఉద్దేశించి మాజీ మంత్రి మాట్లాడబోతుండగా పట్టణ ఎస్ఐ పి.హజరతయ్య తన సిబ్బందితో వచ్చి మైక్ పర్మిషన్ లేదంటూ శిబిరంలో ఉన్న మైక్సెట్ను బలవంతంగా లాక్కొని వెళ్లారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి రజని మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యపై శాంతియుతంగా పోరాడుతుంటే ఎందుకు మైకులు తొలగిస్తున్నారు? పర్మిషన్కు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తున్నారా అంటూ నిలదీశారు. అయినప్పటికీ పోలీసులు మొండిగా మైక్సెట్ను తొలగించి తమతో తీసుకువెళ్లారు. ఈ సమయంలో పోలీసుల జులుం నశించాలి అంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో మాజీ మంత్రి మైక్ లేకుండానే ప్రసంగించాల్సి వచ్చింది.
నిరసన దీక్షల వద్ద అప్రజాస్వామిక ఆంక్షలు


