ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ సమస్యల పరిష్కారానికి సంఘాల నేతల డిమాండ్
నరసరావుపేట: ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, ఆశా వర్కర్లు, వెలుగు వీఓఏలు భారీ ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గాంధీ పార్కు ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో స్కీం వర్కర్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, స్కీం వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. ఆంజనేయులు నాయక్పై పోలీసులు దాడి చేశారని నాయకులు ఆరోపించారు. దీనిని ఖండించిన నాయకులు ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాలు మానుకోవాలని, దాడులకు తాము భయపడబోమని హెచ్చరించారు. అనంతరం యూనియన్ నాయకులు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ముందుగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి. శివకుమారి అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత కూటమి నాయకులు స్కీం వర్కర్ల ఆందోళనలకు సంఘీభావం తెలిపి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు , కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి వై. రాధాకృష్ణ , ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఎన్. ప్రసాదరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లీశ్వరి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి. శివకుమారి, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు కె. చంద్రకళ, ఎం. రత్నకుమారి పాల్గొన్నారు.


