గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
గురజాల: టీటీడీ బ్రేక్ దర్శనం లెటర్లు అమ్ముకుంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామీ.. అంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి వేంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. పల్నాటి తిరుమలగా పేరుగాంచిన స్థానిక నగర పంచాయతీలోని జంగ మహేశ్వరపురంలో ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడాల్సిన వారే అధర్మం వైపు నడుస్తుంటే ఏమి చేయాలో అర్థం కావడం లేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్ముకోవడం ఏమిటన్నారు. ఇంతటి దుర్మార్గం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్రెడ్డి, మాచర్ల పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవి), మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, పట్టణ కన్వీనర్ కె.అన్నారావు, కర్రా చినకోటేశ్వరరావు, బండ్ల వెంకయ్య, షేక్ నాగులుమీరా, నాగులు, కర్రా గిరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


