సంక్షేమంలోనూ పొరుగు వారే! | - | Sakshi
Sakshi News home page

సంక్షేమంలోనూ పొరుగు వారే!

Jul 27 2026 1:48 AM | Updated on Jul 27 2026 1:48 AM

కలెక్టర్‌కు వినతి

అరకొర జీతాలతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సతమతం

సంక్షేమ పథకాలకు దూరం

సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు అందుకోవడమే కారణం

ఆర్థిక ఇబ్బందులతో భారంగా కుటుంబ జీవనం

తాజాగా తల్లికి వందనం పథకానికీ అనర్హులు

ఒకటో తేదీ వచ్చిందంటే అకౌంట్‌లో పడే జీతానికి, అయ్యే ఖర్చులకు లెక్క సరిపోదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగమంటూ పెదవులపై ప్లాస్టిక్‌ నవ్వులు పులుముకుని ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఇంట అప్పుల కుంపటి ఆరదు. వేతనాలు పెంచండని వేడుకున్నా చంద్రబాబు ప్రభుత్వం మనసు కరగడం లేదు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో కీలకమైన విధులు నిర్వర్తిస్తున్నా, అరకొర వేతనాలతో కుటుంబాలను కన్నీటితో వారు నెట్టుకొస్తున్నారు. కనీసం సంక్షేమం కూడా దరి చేరడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అంగన్‌వాడీలకు సైతం అమలు చేసి, చిరు ఉద్యోగులకు మాత్రం ఇవ్వకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు.

నరసరావుపేట టౌన్‌: ఒకవైపు ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నారు... మరోవైపు అదే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మాత్రం అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఇదే రాష్ట్రంలో వేలాది మంది పొరుగు సేవల సిబ్బంది దీనస్థితి. దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్‌లు, సొసైటీలలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో పిల్లల చదువుల కోసం నగదు జమ చేసింది. తమకు మాత్రం సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో ఆవేదన మరోసారి తెరపైకి వచ్చింది. సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ మెడలో వేలాడుతుండగా కనీస వేతనాలు గానీ, సంక్షేమం గానీ అమలు కాక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీవితం డీలా పడిపోతోంది. ఇప్పటికై నా మా జీతాలు చూసి జీవితాల్లో మార్పు తీసుకురావాలని వేడుకుంటున్నారు.

పేరుకే ప్రభుత్వ కొలువు..

ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలకు రూ.15 వేల వేతనం చెల్లిస్తున్నప్పటికీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ మినహాయింపుల తర్వాత చేతికి అందేది కేవలం రూ.13,087 మాత్రమే. పెరుగుతున్న ధరలు, అద్దె, పిల్లల చదువులు, వైద్య ఖర్చుల మధ్య ఈ మొత్తంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా, సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదై ఉందని అంటున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని వాపోతున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదవడంతో తల్లికి వందనంతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు కూడా అనర్హులుగా పరిగణిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఉన్నప్పటికీ, సీఎఫ్‌ఎంఎస్‌ నమోదును కారణంగా చూపుతూ పథకం వర్తింపజేయడం లేదని వారు చెబుతున్నారు. తక్కువ వేతనం పొందుతున్న తమలాంటి కుటుంబాలకు ఈ సాయం అత్యంత అవసరమని పేర్కొంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు లభించే వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు తమకు లేవని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పేద కుటుంబాలకు అందించే సంక్షేమ పథకాలూ అందక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాను గత సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌సోర్సింగ్‌ పారామెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు పీజీఆర్‌ఎస్‌లో కలసి వినతిపత్రం అందజేశారు. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తల్లికి వందనం సహా అన్ని అర్హత ఆధారిత సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నారని వాపోయారు. శాశ్వత ఉద్యోగులకు ఉండే వేతనాలు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లి న్యాయం చేయాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement