చీరాల: చేనేతల పితామహుడు ప్రగడ కోటయ్య అని రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. ఆదివారం స్థానిక పద్మశాలి బహూత్తమ సంఘ కల్యాణ మండపంలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను నిర్వహించారు. చేనేత రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి ఎస్.సవిత హాజరయ్యారు. చేనేత వస్త్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత రంగానికి సహకార సంఘాలు ఎంతో ప్రయోజనం చేస్తాయని ప్రగడ కోటయ్య నమ్మారని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వారి గళాన్ని వినిపించిన వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర చేనేత కార్మికుల సొసైటీలు, సహకార సంఘాలు వ్యవస్థాపకులుగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర చేనేత, జౌళి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా, సంచాలకులు రేఖరాణి, ఉపసంచాలకులు బి.వెంకటేశ్వరరావు, సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య, ఆప్కో ఎండీ కన్నబాబు పాల్గొన్నారు.


