మొవ్వా విజయలక్ష్మి స్మారకోపన్యాసంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్చార్జి రెక్టార్ ఆర్.శివవరామప్రసాద్
తెనాలి: ఆండ్రాయిడ్ టెక్నాలజీ సెల్ఫోన్లలో గల వందలాది అప్లికేషన్స్ను విద్యార్థులు నేర్చుకుంటే జీవితంలో విజయం సాధించటం తథ్యమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్చార్జి
రెక్టార్ ఆర్.శివవరామప్రసాద్ సూచించారు. పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి సేవాసమితి ఆధ్యర్యంలో ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన ప్రత్యేక సభకు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ఆర్.శివరామప్రసాద్ ‘విద్యార్థులు–భవిష్యత్ సవాళ్లు’ అంశంపై మొవ్వా విజయలక్ష్మి స్మారక ప్రసంగం చేశారు. సెల్ఫోన్లో అనవసర విషయాలను వీక్షించటం మానుకోవాలని స్పష్టం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ జీవితంలో ఎదగాలని చెప్పారు. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తన ప్రసంగంలో బాల్యం నుండే తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఈర్ష్య, అసూయలకు ఆస్కారం లేకుండా ఇతరులకు చేతనైన సేవ చేస్తూ సంతృప్తికరంగా గడపాలని సూచించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తల్లికి నమస్కరించి చెడు పనులకు దూరంగా ఉంటూ, తోటివారికి సహాయం చేస్తూ, సన్మార్గంలో నడవాలని చెప్పారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలు ప్రతి రోజూ కొంత సమయం మాట్లాడుకోవాలని సలహానిచ్చారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకుని క్రియాశీలత, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550 పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున మొత్తం 60 మందికి రూ.3 లక్షలను బహూకరించి, జ్ఞాపికలను అందజేశారు. బెల్లంకొండ వెంకట్ స్వాగతం పలికిన సభలో డాక్టర్ మొవ్వా ఏసుబాబు, పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, కొత్త హరిప్రసాద్, డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరప్రసాద్, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, షేక్ బాష, వెంపటి సత్యనారాయణ, మొవ్వా విజయలక్ష్మి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


