డీఈఓ రామారావు
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం– 2026 దరఖాస్తు గడువును ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు మంగళవారం తెలిపారు. అర్హులైన వారిని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించి వారు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించి సంబంధిత అధికారికి దరఖాస్తులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే పాఠశాలల్లో కనీసం 10 సంవత్సరాల క్రమబద్ధమైన సేవను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు. అర్హత గల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఈనెల 20వ తేదీ లోగా సంబంధిత డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
పిడుగురాళ్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వై వార్షిక 2026లో జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్(జేడీఎన్) రాష్ట్ర చైర్మన్ 2026–28 పదవికి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలను ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ డాక్టర్ జీఎస్ మూర్తి అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్కుమార్ పిడుగురాళ్ల ఐఎంఏ శాఖ అధ్యక్షులుగా, ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా భరత్కుమార్ను పలువురు వైద్యులు అభినందించారు.
దాచేపల్లి: గూడ్స్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రాత్రి రాత్రి 8:30 గంటల సమయంలో పొందుగల–నడికుడి రైల్వేస్టేషన్ల మధ్య ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. గమనించిన గూడ్స్రైలు లోకో పైలట్ పలు మార్లు గట్టిగా హారన్ మోగించినప్పటికి సదరు మహిళ పట్టాలపై నుంచి పక్కకు తప్పుకోలేదు. దీంతో గూడ్స్రైలు కిందపడి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి శరీరంపై పింక్ కలర్ పూల డిజైన్చీర, నలుపు రంగు జాకెట్ ఉన్నది. నడికుడి రైల్వే పోలీస్లు మృతదేహాన్ని పరిశీలన చేసి కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నడికుడి రైల్వే పోలీసుల సెల్ నెంబర్ 92475 85720, 94403 73372 సంప్రదించాలని కోరారు.


