గంజాయి విక్రేతలు అరెస్టు
లక్ష్మీపురం: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద గల 1.5 కిలోల గంజాయిని నగరంపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, నగరంపాలెం సీఐ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. వీఐపీ రోడ్డు, కృష్ణబాబు కాలనీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి లాలుపురం వెళ్లే డొంక రోడ్డులో గల శ్రీవల్లి దేశసేన సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు పఠాన్ నాగూర్ వలి, అలియాస్ గుండు, బత్తుల దుర్గారావు, బోడా నరేష్లు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో విచారించారు. వారు తమ వద్ద గంజాయి ఉన్నట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. స్టేషన్లో విచారించగా ప్రధాన నిందితుడు పఠాన్ నాగూర్ వలి తన తల్లి నాగూర్ బితో కలిసి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్నచిన్న పొట్లాలుగా తయారు చేసి యువకులు, ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. గతంలో అతనిపై నగరంపాలెం పోలీస్స్టేషన్లో హత్యాయత్నం కేసు ఎన్డీపీఎస్ చట్టం కింద మరొక కేసు నమోదైనట్లు కూడా విచారణలో వెల్లడైందని తెలిపారు. దీంతో ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో షేక్ నాగూర్ బి అనే మహిళను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు.
12న టెట్ ఆంగ్లంపై అవగాహన తరగతులు
గుంటూరు ఎడ్యుకేషన్: సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో ఈనెల 12న ఉదయం 9 గంటలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 1ఏ, 2ఏలోని ఆంగ్ల భాషా సబ్జెక్టుపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ తెలిపారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం అవగాహన తరగతుల పోస్టర్లు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆంగ్ల భాషా సబ్జెక్టు బోధనలో పేరుగాంచిన ఒంగోలుకు చెందిన అధ్యాపకుడు బి.ప్రసాద్ బోధిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 1ఏ, 2ఏ పరీక్ష రాయనున్న ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


