ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం | - | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం

Jan 2 2026 11:12 AM | Updated on Jan 2 2026 11:12 AM

ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం

ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం

● నియోజకవర్గ పరిధిలో రోడ్లు గుంతమయంగా ఉన్నాయని మరమ్మతులు చేయించాలని కోరినప్పటికీ కమిషనర్‌, పట్టించుకోకపోవడంతో ఏకంగా ఎమ్మెల్యే ఆమె అనుచరులతో స్వయంగా గుంతలలో మట్టి పోసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ● పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కోరారు. నగర పాలక సంస్థ సిబ్బంది కొన్ని వీధుల్లో తిరిగి ఫొటోలు దిగి వెళ్లిపోయారు. ● తుపాను బాధితులకు నష్ట పరిహారం పంపిణీ విషయంలోనూ ఎమ్మెల్యేకి సమాచారం లేకుండా మేయర్‌, కమిషనర్‌ కార్యక్రమాలు నిర్వహించారు.

పశ్చిమ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు తొలిగించిన నగర పాలక సంస్థ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ మహిళా నాయకులు కమిషనర్‌ పులి శ్రీనివాస్‌ ఆదేశాలతోనే తొలగించారంటూ ఆరోపణ

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే గళ్లా మాధవి అనుచరులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను నగర పాలక సంస్థ సిబ్బంది గురువారం తొలగించడంపై వివాదం రాజుకుంది. గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, నగరపాలక సంస్థ కమిషనర్‌ పులి శ్రీనివాసులు మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఫ్లెక్సీల తొలగింపుతో ఇది తారాస్థాయికి చేరుకుంది. పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీ అభిమానులు, నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వేడుకలు ముగియకుండానే నగరపాలక సంస్థ సిబ్బంది గురువారం తొలిగించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమణల నిర్మూలన దళం సిబ్బందిని నిలదీశారు. అయితే సిబ్బంది ‘మీకు చేతనైంది చేసుకోండి’ అంటూ బెదిరించినట్లు మహిళా నాయకురాలు లాం నవమి ఆరోపించారు. ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ కమిషనర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యేను పట్టించుకోని కమిషనర్‌

పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవిని ఆది నుంచి కమిషనర్‌ పులి శ్రీనివాసులు బేఖాతరు చేస్తూ వస్తున్నారు. కమిషనర్‌ తీరుపై ఎమ్మెల్యే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసిన విషయం విదితమే.

పెమ్మసానికి ఎమ్మెల్యే ఫిర్యాదు

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి గురువారం కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఫ్లెక్సీల తొలగింపు విషయాన్ని పెమ్మసాని దృషికి తీసుకెళ్లినట్లు సమాచారం. నగరపాలక సంస్థ కమిషనర్‌ తన మాటను బేఖతారు చేస్తున్నారని, కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. పెమ్మసాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement