వాకింగ్లా లోకేష్ యాత్ర
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజం
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుత్రరత్నం లోకేష్కు పాలనపై ఏమాత్రం అనుభవం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు క్యాబినెట్లో ఆయన మంత్రిగా చేసినా ఐఏఎస్లు, ఇతర అధికారులే పనులు చక్కబెట్టేవారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో శుక్రవారం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అనుభవారాహిత్యం ప్రస్తుతం లోకేష్ను వెంటాడుతోందని, అందుకే టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తుందనే విషయం చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీచేసి గెలవలేకపోయిన లోకేష్ మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని చెప్పారు. ‘‘వంద రోజుల పాదయాత్రకే లోకేష్కు శరీరం సహకరించట్లేదని, అందుకే సాయంత్రాలు తూతూమంత్రంగా ఈవెనింగ్ వాక్లా పాదయాత్రను సాగిస్తున్నారని, ఎండకు బయటకు వెళ్లకుండా ఏసీలోనే అధిక సమయం గడిపేస్తున్నారని అప్పిరెడ్డి ఎద్దేవా చేశారు.