భువనేశ్వర్: స్థానిక లోక్ సేవా భవన్ ప్రాంగణాన్ని పొగాకు రహిత ప్రాంతంగా ప్రకటించారు. లోక్ సేవా భవన్ ప్రాంగణంలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం మరియు కిళ్లీ (పాన్) ఉమ్మివేయడం కట్టుదిట్టంగా నిషేధించామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఉల్లంఘించిన ఏ చర్య అయినా అమల్లో ఉన్న చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని విభాగం హెచ్చరించింది. క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో సహా అనేక అంటు వ్యాధులకు పొగాకు ఒక ప్రధాన కారణమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భారత దేశంలో ఏటా పొగాకు వాడకం వల్ల సుమారు 13 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. అందువల్ల ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, ఉద్యోగులు, సందర్శకుల కోసం పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఈ చొరవ స్వచ్ఛ భారత్, స్వస్థ్ భారత్, నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యాలను బలోపేతం చేయడంతో పాటు లోక్ సేవా భవన్ను పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పొగాకు రహిత కార్యస్థలంగా మారుస్తుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ ఆశాభావం వ్యక్తం చేసింది. పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు ప్రయ త్నాలను ముమ్మరం చేస్తున్నామని మంత్రి అన్నారు. యువతలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో పొగాకు పూర్తిగా దూరంగా ఉండేలా ప్రోత్సహించే ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రి అన్నారు.
కిడ్నాప్ కేసులో ఇద్దరు అరెస్టు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్లో ఉపాధ్యాయుడి కిడ్నాప్ ఘటనను టికిరి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో పాటు కిడ్నాప్కు ఉపయోగించిన ఎరుపు రంగు కారును స్వాధీనం చేసుకున్నారు. సమితిలోని ఉపరకడింగా ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాశీనాథ్ సాహు ఈనెల 5వ తేదీన కిడ్నాప్కు గురయ్యారు. బంకాబ్, మంకడజొల మధ్య నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం నుంచి ఆయనను అపహరించారు. కుటుంబ సభ్యులు ఈ మేరకు టికిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు పట్టుబడతామనే భయంతో కిడ్నాపర్లు మరుసటి రోజే కొరాపుట్ సమీపంలో ఉపాధ్యాయుడిని వదిలిపెట్టారు. ఈ ఘటనపై టికిరి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరైస్టెనవారిలో మంకడజొలకు చెందిన చిత్తరంజన్ బాగ్, కొరాపుట్ నందపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దాడి గ్రామానికి చెందిన రంజిత్ ఖిల్లలు ఉన్నారు. కిడ్నాప్కు గల కారణాలు, ఈ కేసులో ఇంకెవరి ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


