రాయగడ: ప్రభుత్వ సంక్షేమ పఽథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో పయనించాలని జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్రనాథ్ కుహరొ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ – 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కాసీపూర్ సమితి కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దివ్యాంగుల హక్కులు, ప్రభుత్వ సౌకర్యాలు, వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016లో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలపై వివరించారు. అలాగే మత్తు పదార్థాలు, మద్యపానానికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, చైతన్యవంతమైన సమాజ నిర్మాణంలో అంతా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎస్వో శ్రీకాంత్ పాణిగ్రహి, కాసీపూర్ బీఎస్ఎస్వో తదితరులు పాల్గొన్నారు.
గుమ్మ బ్లాక్ ప్రజలతో ఎమ్మెల్యే రూపేష్ సమావేశం
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మా బ్లాక్ ఝమ్మి, మింజిరి గ్రామస్తులతో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి శుక్రవారం సమావేశం నిర్వహించారు. పర్లాకిమిడి హైటెక్ ప్లాజాలో నిర్వహించిన సమావేశంలో గుమ్మాబ్లాక్ నుంచి వచ్చిన 50 మంది గ్రామస్తులతో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జమ్మి, మింజిరి మారుమూల గ్రామంలో మంచినీరు, ఉపాధి, శిక్షణ, రోడ్లు వేయాలని ఎమ్మెల్యే రూపేష్ను అభ్యర్థించారు. ఆయనతో పాటు బీజేడీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ నాయక్, గుమ్మసమితి చైర్మన్ సునేమీ మండళ ఉన్నారు.
దైవిక ఆలోచనలతో యువత ఎదగాలి
భువనేశ్వర్: యువతలో ఆధ్యాత్మికత భారత దేశపు నిర్మాణాత్మక పురోగతికి దోహదపడుతుందని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి యువతని ప్రోత్సహించారు. భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో యువజన సంఘాలు ఏర్పాటు చేసిన పలు గణపతి పూజా ప్రాంగణాలు సందర్శన పురస్కరించుకుని యువతతో ముచ్చటించారు. ఆయా ప్రాంగణాల్లో పూజా నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతించారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు సోదరభావాన్ని పెంపొందించి, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధిని ప్రేరేపిస్తాయని అభినందించారు.
లింగ రాజ్ ఆలయంలో పూజలకు అంతరాయం
భువనేశ్వర్: స్థానిక లింగరాజ్ ఆలయంలో రెండు వర్గాల సేవకుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా దైనందిన పూజా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. సేవా హక్కుల విషయంలో పూజా పండా, పత్రి సేవకుల మధ్య ఘర్షణ జరగడంతో ఆలయంలో రోజువారీ పూజలు నిలిచిపోయాయి. బొడొసింఘార్ అలంకరణ తర్వాత పూజా పండా సేవకులు పూజలు చేయడం ఆపేశారు. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగా లింగ రాజ్ మహా ప్రభువుకు నిర్దేశించిన రోజువారీ పూజలు ముందుకు సాగలేదు. సమస్యను పరిష్కరించడానికి ఆలయ పరిపాలన విభాగం సంబంధిత సేవా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జరిగిన చర్చల ద్వారా ఆచారాలలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరించి భవిష్యతులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాదని పాలక వర్గం ఆశిస్తుంది. తరచూ సేవకుల వర్గంలో తలెత్తుతున్న వివాదాల కారణంగా తరచు లింగ రాజు మహా ప్రభువు దీర్ఘ కాలం పూజాదులకు నోచుకోని దయనీయ పరిస్థితిపై భక్తుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ విబేధాలకు శాస్వత పరిష్కారం లింగ రాజ్ మహా ప్రభువుకు నిరంతర పూజా కార్యక్రమాలకు మార్గం సుగమం చేస్తుందని భక్తజనం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.


