న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
శ్రీమందిరంలో ..
భువనేశ్వర్:
శ్రీ జగన్నాథ మహా ప్రభువు లీలలు ఎంత అద్భుతమో అంతే గూఢమైనవి. తల్లిగా మారి గర్భవేదనను అనుభవించే జగన్నాథుడు తిరిగి ఆ తల్లి గర్భం నుంచి శ్రీకష్ణునిగా అవతరించడం శ్రీ మందిరంలో జన్మాష్టమి ఘట్టం విశిష్టత. ఆయనకు తల్లి కూడా ఆయనే. తండ్రి కూడా ఆయనే. సంతానం కూడా ఆయనే. జగన్నాథుని లీలలు తర్కానికి అందనివి. అవి అనుభూతి, భక్తి, విశ్వాసానికి సంబంధించినవి. భక్తుని భావనకు అనుగుణంగా అనేక రూపాల్లో దర్శనం ఇచ్చే మహా ప్రభువు లీలల్లో జన్మాష్టమికి ముందు రోజు శ్రీ మందిరంలో జరిగే గర్భోదక నీరాజనం, జెవుటో భోగం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక ఘట్టం. శ్రీ జగన్నాథుని లీలలో త్వమేవ మాతా చ పితా త్వమేవ–నీవే తల్లి, నీవే తండ్రి అని భక్తుని లోతైన భావం ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తుంది. ఒక సందర్భంలో ఆయన తల్లి రూపంలో మరొక సందర్భంలో ఆ తల్లికి పుత్రునిగా స్వామి అవతరిస్తాడు అనే గూఢత్వాన్ని ప్రదర్శిస్తుంది. జన్మాష్టమికి ముందు రోజు పవిత్ర భాద్రపద కష్ణ పక్ష సప్తమి తిథి పురస్కరించుకుని శ్రీ మందిరంలో ఈ ప్రత్యేకంగా గర్భోదక నీరాజనం గురువారం రాత్రి పూట నిర్వహించారు. శ్రీ కృష్ణుని జన్మ లీలను పురస్కరించుకుని జగన్నాథ మహా ప్రభువు స్వయంగా శ్రీకష్ణుని తల్లి దేవకీ దేవి రూపాన్ని ధరించి గర్భిణి ప్రసవ వేదనను అనుభవిస్తున్నట్లుగా ఈ లీలను భావిస్తారు. ఈ సందర్భంగా ప్రసవ వేదన నివారించేందుకు మహా ప్రభువుకు ప్రత్యేకంగా జెవుటో భోగం సమర్పిస్తారు.
గర్భకష్టాన్ని అనుభవించే జగన్నాథుడు
శ్రీ మందిరంలోని సాయంకాల నిత్య కై ంకర్యాలలో భాగంగా సంధ్యా ధూపం ముగిసిన తరువాత నీరు చల్లి శుద్ధి చేసి ధో పొఖాలో తంతు పూర్తి కావడంతో తెర చాటున నీరాజనం సమర్పించారు. అనంతరం ప్రతిహారి సేవకుడు పోటు ప్రాంగణం నుంచి జెవుటో భోగాన్ని తీసుకువచ్చి శ్రీమందిరంలో పూజా పండా వర్గం సేవకులకు అందజేయడంతో పంచోపచార విధానంలో మహా ప్రభువుకు భోగాన్ని నివేదించడం ఆచారంగా వ్యవహరించారు. అనంతరం పూజా పండా, పతి మహా పాత్రో, ముదిరొస్తొ సేవకులు యదావిధిగా మూడు మూల విరాట్లకు నీరాజనం సమర్పించి మహా ప్రభువు శ్రీ జగన్నాథునికి ప్రత్యేకంగా మరోసారి గర్భోదక నీరాజనం సమర్పించడం ఈ ఘట్టంలో విశిష్టత. ఆ తర్వాత గర్భవతి దేవకీ రూపంగా భావించబడే శ్రీ జగన్నాథ మహా ప్రభువుకు గర్భకష్ట నివారణార్థం రుచికరమైన జెవుటొ భోగాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తారు.
భోగంలో ఏమేం ఉంటాయి?
జెవుటొ ప్రత్యేక భోగంలో భాగంగా వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలు, పిండి వంటకాలు, ఝిల్లీ (ప్రత్యేకమైన మిఠాయి), చిన్న అరిసె, ఖిరి (పాయసం) తదితర ప్రసాదాలను సమర్పిస్తారు. మహా ప్రభువు యొక్క మాతృత్వ భావనను, శ్రీకృష్ణుని జన్మలీలను, జగన్నాథ తత్త్వంలోని అపారమైన రహస్యాన్ని ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక సంకేతం జెవుటో భోగ సమర్పణ.
దర్శనం నిలిపివేత
జన్మాష్టమికి ముందు రోజు శ్రీ కష్ణ జననం ప్రత్యేక ఘట్టం నిర్వహణ పురస్కరించుకుని శుక్ర వారం సాయంత్రం ధూపం సమర్పించిన తర్వాత రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. భాద్రపద కష్ణ పక్ష సప్తమి సందర్భంగా శ్రీ మందిరంలో గర్బోధక నీరాజనం (బొంధాపొణా), జెవుటొ భోగం సమర్పణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికార వర్గాలు పేర్కొన్నాయి.


