పర్లాకిమిడి: జిల్లాలోని రాయఘడ బ్లాక్ చంపాసాహి గ్రామానికి చెందిన కహ్నూభుయ్యాన్ రాష్ట్రస్థాయి నీట్ పరీక్షా ఫలితాల్లో 21వ ర్యాంకు సాధించినందుకు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి బుధవారం రాంనగర్లో హైటెక్ ప్లాజాలో జ్ఞాపికతో అభినందించారు. అలాగు మొదటి సంవత్సరం కళాశాల ప్రవేశ రుసుము రూ.40 వేలు విద్యార్థికి ఆర్థిక సాయంగా అందజేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత గజపతిలోని ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సహకారం అందించాలని ఆకాంక్షించారు.
ట్రక్ బోల్తా.. డ్రైవర్కు గాయాలు
మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి ఎంవీ 23 గ్రామం వద్ద టైర్ల లోడుతో వెళ్తున్న ఒక ట్రక్ టైర్ పంక్చర్ అవ్వడంతో అదుపుతప్పి పంటపొలాల్లో బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. అయితే సమీపంలో ఉన్న స్థానికులు డ్రైవరును వెంటనే బయటకు తీసుకొచ్చి కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయన చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కలిమెల పోలీసు ఐఐసీ ప్రభుదత్త బిశ్వల్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై కేసు నమోదు చేశారు. డ్రైవర్కు స్పృహ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
పురుగు మందు తాగి మహిళ దుర్మరణం
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి కొలార్ గ్రామ పంచాయతీ హతీపకన గ్రామంలో దశరథ పంగి భార్య మోతీ పంగి(34) పురుగుల మందుతాగి దుర్మరణం చెందింది. బుధవారం ఏదో కారణంతో మోతీ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో కొరాపుట్ సాహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. సమాచారం అందిన బొయిపరిగుడ పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
దుకాణాల్లో తనిఖీలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ నగరపాలక సంస్థ (ఎన్.ఏ.సి.) ఆధ్వర్యంలో గురువారం అధికారులు నిషేధిత పాలిథిన్ కవర్ల వినియోగంపై పలు రెస్టారెంట్లు, కిరాణా, దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసి జరిమానాలు విధించారు. కాశీనగర్ ఎన్ఏసీలో ఎక్కడపడితే అక్కడ పాలిథిన్ చెత్త పెరిగిపోవడంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. కాశీనగర్లో పాలిథిన్ను బ్యాన్ చేయడం జరిగిందని నగరపాలక సంస్థ అఽధికారులు తెలియజేశారు.


