జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి రణస్పూర్ గ్రామ పంచాయతీ జొడాపుట్ గ్రామంలో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ఇంటిగోడ కూలి మీద పడడంతో దుర్మరణం చెందింది. మరణించిన విద్యార్థిని జొడాపుట్ గ్రామానికి చెందిన కమలా తండి(15). కమలా తండి బొరిగుమ్మ సమితి బిసింగపూర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఎప్పటిలానే లేచి ఇంటి పనులు చేస్తున్న సమయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన బాగా తడిచి ఉన్న ఇంటిగోడ అకస్మాత్తుగా కూలి ఆమైపె పడింది. గోడ కింద ఉండిపోయిన కమలా తండి ఆక్రందనలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే బొరిగుమ్మ కమ్యూనిటీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి మరింత విషమం కావడంతో అక్కడ నుంచి కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్కు చేర్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కమలా తండి మృతి చెందింది. విషయం తెలియడంతో బిసింగపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెకు కన్నీటితో నివాళులర్పించారు. వీరి కుటుంబం నిరుపేదది కావడంతో దహన సంస్కారాలకు బొరిగుమ్మ తహసీల్దార్ శోభన్ కుమార్ బెహర రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంజయ చలాన్ ద్వారా మృతురాలి కుటుంబానికి రూ.5 వేల నగదు అందించారు.


