రాయగడ: వర్షాకాలం వచ్చిందంటే చాలు పంచుపాండవ గ్రామస్తులకు వాగు దాటడం ప్రాణాలతో చెలగాటంగా మారుతోంది. గ్రామానికి సమీపంలోని వాగుపై వంతెన లేకపోవడంతో భారీ వర్షాలకు నీటి ప్రవాహం ఉధృతంగా మారిన ప్రతి సారి గ్రామస్తులు ప్రాణాలను ఫణంగా పెట్టి వాగును దాటాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని గుడారి సమితిలో అల్పపీడనం ప్రభావంతో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెండిలి పంచాయతీ పరిధిలోని పంచుపాండవ గ్రామ సమీపంలోని వాగులో నీటి ప్రవాహం పెరిగింది. పొలాల్లో వ్యవసాయ పనులు, కొండ ప్రాంతాల్లోని తోటల పనులు ముగించుకుని ఇళ్లకు తిరిగి వస్తున్న గ్రామస్తులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటక తప్పని పరిస్థితి ఏర్పడింది. మహిళలు, చిన్నారులు, యువకులు, వృద్ధులు సైతం ప్రమాదకర పరిస్థితుల్లో వాగును దాటుతున్నారు. రోగులు, వృద్ధులు, గర్భిణులు వెళ్లాలంటే చిక్కులు తప్పడం లేదు.
ఏళ్లుగా ఇదే సమస్య
వర్షాకాలంలో ఉద్ధృతంగా ప్రవహించే వాగును దాటడం తమకు నిత్యకృత్యంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. పంచుపాండవ గ్రామం మారుమూల ప్రాంతంలో ఉండడంతో అక్కడి ప్రజలకు శాశ్వత రవాణా సౌకర్యం అత్యవసరమని గ్రామస్తులు తెలిపారు.


