మంత్రి రాజీనామా కోసం
కొరాపుట్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నిత్యానంద గొండో రాజీనామా కోరుతూ ప్రతి పక్ష బీజేడీ పార్టీ భారీ ఆందోళన చేసింది. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో చమిరియా గుడ నుంచి వేలాది మంది కార్యకర్తలు ర్యాలీ చేశారు. విద్యార్థులకు అందాల్సిన పాఠ్య పుస్తకాలను గుజరాత్లో ముద్రణ చేసి, అందులో వందలాది తప్పులు దొర్లాయని ఆరోపించారు. తద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు మౌలిక సదుపాయాల లోపంతో మృత్యువాత పడుతున్నారని గుర్తు చేశారు. నబరంగ్పూర్ జిల్లాకి చెందిన నిత్యానంద సొంత నియోజక వర్గం ఉమ్మర్కోట్లో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయంపై నినాదాలు చేశారు. కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన నిర్వహించి ప్రముఖులు ప్రసంగించారు. కలెక్టర్ మహేశ్వర్ స్వయ్కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి, విద్యా మంత్రి నిత్యానంద గొండో గడ్డి బొమ్మలకు నిమ్మకాయల దండలు వేసి దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో రాష్ట్ర యువ బీజేడీ అధ్యక్షుడు చిన్మయ్ సాహు, అధ్యక్షురాలు ఇప్సితా సాహు, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, జెడ్పీ ప్రెసిడెంట్లు మోతిరాం నాయక్ (నబరంగ్పూర్), సస్మితా మెలక (కొరాపుట్), బీజేడీ నాయకులు గుప్త జంకర్, మంజులా మజ్జి, సదాశివ ప్రదాని, అరుణ్ మిశ్ర, శిల్పా పాణి, సుభాష్ గొండో తదితరులు పాల్గొన్నారు.


