ఐపీఎస్‌ అధికారుల బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Aug 22 2026 1:47 AM | Updated on Aug 22 2026 1:47 AM

భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సీనియర్‌ ఐపీఎస్‌ కేడర్‌ అధికారులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు, నిఘా విభాగాలలో 6 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర గవర్నర్‌ ఆమోదంతో శుక్రవారం హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం సంబల్‌పూర్‌లోని నార్తర్న్‌ రేంజ్‌ ఇనస్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉన్న 2003 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి హిమాన్సు కుమార్‌ లాల్‌ను స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) అదనపు బాధ్యతలతో భువనేశ్వర్‌లోని ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమించారు. ప్రస్తుతం తాల్చేర్‌లోని నార్తర్న్‌ సెంట్రల్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉంటూ అంగుల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌ (పీటీసీ) ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న 2004 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సత్యబ్రత్‌ భోయ్‌ను ఇంటెలిజెన్స్‌ ఇనస్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమించారు. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఒడిశా ఇంటెలిజెన్స్‌ ఇనస్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉన్న 2005 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి జై నారాయణ్‌ పంకజ్‌ను బరంపురం సదరన్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం బరంపురం, సదరన్‌ రేంజ్‌ ఇనస్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉన్న 2007 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి నీతి శేఖర్‌ను పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ప్రొవిజనింగ్‌)గా నియమించారు. కేంద్ర డిప్యుటేషన్‌ నుంచి తిరిగి వచ్చి హోం శాఖలో చేరిన 2010 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఆశిష్‌ కుమార్‌ సింగ్‌ను తాల్చేర్‌లోని నార్తర్న్‌ సెంట్రల్‌ రేంజ్‌ డీఐజీగా, అంగుల్‌లోని పీటీసీ ప్రిన్సిపాల్‌ అదనపు బాధ్యతలతో నియమించారు.

మొక్కలతోనే మనుగడ

రాయగడ: పర్యావరణ హితానికి మొక్కలు ఎంతగానో దోహదపడతాయని స్థానిక లయన్స్‌ క్లబ్‌ అపరాజిత సంస్థ సభ్యులు అన్నారు. స్థానిక చైతన్య టెక్నో స్కూల్‌ ప్రాంగణంలొ మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లయన్స్‌ డిస్టెక్టు గవర్నర్‌, ఇంజినీర్‌ అశ్విన్‌ కుమార్‌ దాస్‌, జీఎల్‌టీ కోఆర్డినేటర్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాలకు చెందిన 30 మొక్కలను ప్రాంగణంలో నాటారు. వాటి సంరక్షణ బాధ్యతను విద్యార్థులతో పాటు స్కూల్‌ నిర్వాహకులు తీసుకోవాలని కోరారు. లయన్స్‌ అపరాజిత అధ్యక్షురాలు పి.కళ్యాణి, కార్యదర్శి ఎస్‌.శ్రావణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. ఇటువంటి తరహా కార్యక్రమాలు మరిన్ని చేపట్టేందుకు అపరాజిత సంస్థ నడుం బిగించిందని క్లబ్‌ అధ్యక్షురాలు కళ్యాణి, శ్రావణిలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement