కలెక్టర్ కార్యాలయం ముట్టడి
అంగన్వాడీ, ఆశ కార్యకర్తల..
రాయగడ:
భారతీయ మజ్దూర్ సంఘ్ మద్దతుతో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు సోమవారం పట్టణంలొ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీపార్క్ నుంచి వేలాదిగా తరలివచ్చిన ఆశ, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు వివిధ శ్రామిక సంఘాలకు చెందిన కార్మికులు ర్యాలీలొ పాల్గొని కలక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ సుమారు గంటన్నర పాటు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం అక్కడే బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు. తరువాత జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరోకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. శ్రామికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) రాయగడ శాఖ ఆధ్యర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జోగేశ్వర్ దాస్, జిల్లా అధ్యక్షుడు మోహన్రావ్ మాఝి, కార్యదర్శి గణేష్ కుమార్ సాహు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. ఈఎస్ఐసీ వేతన పరిమితిని రూ. 21 వేల నుంచి రూ. 42 వేలకు పెంచాలని, ఈపీఎఫ్ కనీస పింఛన్ రూ. వెయ్యి నుంచి రూ 7,500 ఇవ్వాలని, వేతన పరిమితిని రూ. 30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే బోనస్ లెక్కింపు పరిమితిని రూ. 18 వేలకు, బోనస్ అర్హత పరిమితిని రూ. 42 వేలకు పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆశ కార్యకర్తల జిల్లా శాఖ అధ్యక్షురాలు జయంతి పద్మాలయ సాహు తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కేంద్ర స్కీం వర్లకు నెలసరి జీతం రూ. 21 వేల నుంచి 42 వేల రూపాయలకు పెంచాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐసీ (బీమా), సమానమైన పనికి, సమానమైన వేతనం, శ్రమ లేబర్ కోడ్లు కేంద్రం రద్దు చేయాలని కోరారు. అలాగే అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 11 డిమాండ్లతో కూడిని వినతిపత్రాన్ని ఏడీఎం ఫల్గునీ మఝి, డిప్యూటీ కలెక్టర్ మనోజ్ పట్నాయక్కు అందజేశారు. బీఎంఎస్ జిల్లా కార్యదర్శి అంజలీ నాయక్, అంగన్వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు కుమారి కున్నీ మఝి, ఆశవర్కర్ల సంఘం కార్యదర్శి పుష్పాంజలి పండా ఉన్నారు.


