జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్ సమితి ఛొడొరంగ్–బెడాగుడ రహదారి మధ్యలో పడి ఉన్న ఒక యువకుని మృతి మిస్టరీని కొట్పాడు పోలీసులు ఛేదించారు. అతడిని హత్య అని నిర్ధారించారు. కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ సబ్డివిజన్ పోలీసు అధికారి సత్యబ్రత లెంక నేడు వెల్లడించారు. పోలీసు అధికారి సత్యబ్రత లెంక వివరణ ప్రకారం.. గత శుక్రవారం రాత్రి కొట్పాడ్ సమితి జమాగుడ గ్రామం సుక్రు పూజారి చొడొరొంగ్– బెడాగుడ రహదారి మధ్య పడి ఉండడం చూసిన ఆ ప్రాంత ప్రజలు, అతడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సుక్రును హత్య చేశారని కొట్పాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసారని ఎస్డీపీఓ తెలియజేశారు. గ్రామస్తులు అతడి కుటుంబ సభ్యులు సమైక్యంగా ఆందోళనకు దిగి హంతకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కొట్పాడ్ పోలీసు అధికారి దీప్తిమయి ధురువ పర్యవేక్షణలో విస్తృతంగా దర్యాప్తు ప్రారంభించారని, దర్యాప్తులో పొలీసులు దుండగులను గుర్తించి వారు వినియోగించిన బైక్తో పాటు హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీన పరచుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని ఎస్డిపిఓ సత్యబ్రత లెంక వెల్లడించారు.


