మల్కన్గిరి : మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాంచల్వాడ గ్రామంలో ఆదివారం రాత్రి కుటుంబ కలహాలతో భార్యపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడో భర్త. గ్రామానికి చెందిన బుదురా మాడీ తన భార్య దేవే మాడీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య దేవే మాడి(38)పై బుదురా గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య వద్దే కూర్చున్నారు. ఇంతలో దేవే తమ్ముడు దేవా మడ్కామి వచ్చి మల్కన్గిరి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఐఐసీ దేవదత్తు మల్లిక్ ఆదేశాలతో ఎస్ఐ ప్రతాప్ గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బుదురాను అరెస్టు చేశారు.
669 మందిని రక్షించిన అగ్ని మాపక దళం
భువనేశ్వర్: రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, నదులు పొంగిపొర్లుతున్న కారణంగా సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఒడిశా అగ్ని మాపక, అత్యవసర సేవల విభాగం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 669 మంది బాధితుల్ని, 95 పెంపుడు జంతువులను రక్షించిందని అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్, హోం గార్ుడ్స కమాండెంట్ జనరల్ డాక్టర్ సుధాంశు షడంగి సోమవారం తెలిపారు. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన జాజ్పూర్, బాలాసోర్ జిల్లాల్లో సహాయక చర్యలు కోసం 78 పడవల 115 సహాయక బృందాలను మోహరించారు. వరద ముంపునకు గురైన గ్రామాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షితంగా తరలించేందుకు జిల్లా యంత్రాంగాల సమన్వయంతో తమ శాఖ విస్తృతమైన సహాయక చర్యలను విజయవంతంగా చేపట్టిందని సుధాంశు షడంగి తెలిపారు. 94 ప్రదేశాలలో నీటిని తొలగించే పనుల్లో సహాయక బృందాలు తలమునకలై ఉన్నట్లు తెలిపారు. జాజ్పూర్లో అత్యధికంగా 350 మందిని రక్షించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాజ్పూర్ జిల్లా విద్యా కార్యాలయం మంగళవారం (ఆగస్టు 18) జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తరగతులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు సెలవు ప్రకటించారు.
ఎఫ్ఏడబ్ల్యూ ఫుట్బాల్ లీగ్ చాంపియన్ జట్టుకు డీజీపీ అభినందనలు
భువనేశ్వర్: కటక్ బరాబటి స్టేడియంలో జరిగిన ఎఫ్ఏడబ్ల్యూ ఫుట్బాల్ లీగ్ చాంపియనన్ షిప్ పోటీలో ఒడిశా పోలీసులు జట్టు ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన నిరాడంబర కార్యక్రమంలో డీజీపీ వినయతోష్ మిశ్రా ఒడిశా పోలీసుల చాంపియన్ జట్టును సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఆటగాళ్ల ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం, జట్టు స్ఫూర్తిని ప్రశంసించారు. ప్రత్యర్థి కటక్ యంగ్ ఉత్కళ్ క్లబ్ జట్టును 5 – 1 స్కోరుతో ఓడించి ఒడిశా పోలీసులు ఎఫ్ఏడబ్ల్యూ ఫుట్బాల్ లీగ్ చాంపియన్గా నిలిచారు. ఫైనల్ మ్యాచ్లో పురుషోత్తం కెర్కెట 2 గోల్స్ చేయగా, లఖాయ్ ముర్ము, రైసెన్ టుడు, విజయ్ బెహెరా తలా ఒక గోల్ సాధించారు. చాంపియన్ జట్టు ట్రోఫీతో పాటు రూ. 1 లక్ష నగదు బహుమతిని ఈ జట్టు గెలుచుకుంది.


