న్యూస్రీల్
గవర్నర్ హరిబాబు
కంభంపాటి
గురువారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ప్రజలకు కల్పించే అవకాశాలే..
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార రంగం బలోపేతం చేయడంతో సమగ్ర అభివృద్ధి ముడి పడి ఉంటుందని, యువత, మహిళలు, చేతి వృత్తులవారు, తొలి తరం పారిశ్రామికవేత్తలకు ఆయా రంగాల్లో వ్యాపార అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని, ప్రధానంగా ఒడిశాలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వ్యవస్థాపకతను మరింత విస్తరింపజేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి బుధవారం పిలుపునిచ్చారు. నగరంలో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఓఏఎస్ఎంఈ) 41వ వ్యవస్థాపక దినోత్సవాలు, వార్షిక రాష్ట్ర స్థాయి సదస్సు–2026లో ఆయన ప్రసంగించారు. 2036 నాటికి వికసిత్ ఒడిశా, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను గవర్నర్ ప్రస్తావిస్తూ అభివృద్ధిని కేవలం పరిశ్రమల పరిమాణం లేదా పెట్టుబడులతో కాకుండా మన ప్రజలకు మనం కల్పించే అవకాశాలతో కొలవాలని తెలిపారు. సంస్థలను ప్రధాన నగరాల నుంచి పట్టణాలు, గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, ఆకాంక్షలున్న మారు మూల జిల్లాలకు తీసుకువెళ్లడంలో ఎంఎస్ఎంఈ ఉనికి కీలకమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతును చివరి అంచె వరకు మరింత బలంగా అందించాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి సౌకర్యాలు, అవగాహన, చేయూత, స్థానిక వ్యవస్థాపక కేంద్రాలను బలోపేతం చేయాలని గవర్నర్ ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, పారిశ్రామిక సంఘాలను కోరారు. పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సాయం, సాంకేతికత, శిక్షణ, మార్కెట్లు సులభంగా అందుబాటులో ఉండాలని సూచించారు. క్లస్టర్ అభివృద్ధి, ఉమ్మడి మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ సౌలభ్యం, పారిశ్రామిక ప్రదర్శనలు, కొనుగోలుదారు, విక్రేత సమావేశాల వంటి రంగాలలో ఓఏఎస్ఎంఈ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. బలమైన స్థానిక పర్యావరణ వ్యవస్థలు, పారిశ్రామిక క్లస్టర్లు, నైపుణ్యాలు, ఆర్థిక సహాయం, మార్కెట్ అనుసంధానం ఒడిశాలోని అంతర్గత ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు ఎంఎస్ఎమ్ఈ ఉద్యమాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు. ముడి చమురు దిగుమతిపై భారత దేశం ఆధారపడకుండా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు క్రమంగా విద్యుత్ వాహనాల వైపు మళ్లాలని గవర్నర్ ఎంఎస్ఎంఈలను కోరారు. రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక విద్యా శాఖ సహాయ మంత్రి సంపద్ చంద్ర స్వంయి, హోం, సమాచార, ప్రజా సంబంధాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, ఎంఎస్ఎంఈ శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి రష్మిత పండా, నాల్కో చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ బిజేంద్ర ప్రతాప్ సింగ్, ఓఏఎస్ఎంఈ సెక్రటరీ జనరల్ సాత్విక్ స్వంయి, ఓఏఎస్ఎమ్ఈ ఛైర్మన్ గౌరీ శంకర్ దాస్ కార్యక్రమంలో ప్రసంగించారు.


