కొరాపుట్: దక్షిణ ఒడిశా పూరీ ధాంగా పిలువబడుతున్న కొరాపుట్ శబరి శ్రీ క్షేత్ర ఆధ్వర్యంలో ఉన్న విభాగాలలో నూతన అధ్యక్షునిగా ఎన్నికై న జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి సోమవారం పర్యటించారు. ట్రస్ట్ అధ్యక్ష పదవి స్వీకరించిన అనంతరం మందిరంలో నడుస్తున్న ఆనంద బజార్లో పని తీరు పరిశీలించారు. ఇందులో రోజూ 700 నుంచి 800 మంది మధ్యాహ్న భోజనాలు చేస్తారు. అందుకు తగ్గ వంటశాల, సామగ్రి, సిబ్బంది ఉన్నారు. భోజనాలు చేసే భక్తుల సంఖ్య పర్వదినాలలో వేల సంఖ్యలో ఉంటుందని సిబ్బంది తెలియజేశారు. క్షేత్రం ఆధ్వర్యంలో ఐదు వసతి గృహాలు ఉన్నాయి. వీటిని తాత్కాలిక రుసుంతో భక్తులకు గదులు కేటాయిస్తున్నారు. వీటి పరిశుభ్రత, పనితీరు పరిశీలించారు.
అంతకు ముందు ట్రస్ట్ సభ్యులతో సమావేశమయ్యారు. శక్తి వంతమైన ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ వర్మని మర్యాద పూర్వకంగా కలిసి చర్చించారు.


