అసెంబ్లీ ప్రాంగణంలో తొలి మహిళా ఎమ్మెల్యే..
భువనేశ్వర్: ఒడిశా తొలి మహిళా ఎమ్మెల్యే, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు సరళా దేవి నిలువెత్తు విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వాతంత్య్ర పోరాటం, మహిళా సాధికారత, సామాజిక సంస్కరణలకు ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. శాసన సభ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించి సరళా దేవిని మహిళా సాధికారతకు, ఒడిశా సామాజిక, రాజకీయ చైతన్యానికి ప్రతీకగా అభివర్ణిస్తూ ఆమెకు నివాళులర్పించారు. సరళా దేవి ఒడిశా తొలి మహిళా శాసనసభ్యురాలు మాత్రమే కాకుండా స్వాతంత్య్ర ఉద్యమానికి, మహిళల హక్కుల సాధనకు కూడా గణనీయమైన కృషి చేశారని అన్నారు. మహిళల విద్య, సామాజిక భద్రత కోసం ఆమె కృషి అనన్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పీకర్ సురమా పాఢి, ఉప ముఖ్యమంత్రులు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ కుమార్ ప్రధాన్, ఏకామ్ర భువనేశ్వర్ నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, మహాకలుపడా నియోజక వర్గం ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


