రాయగడ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శిష్టకరణాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హోటల్ స్వాగత్ సమీపంలో గల కొదండ రామ మందిరం ప్రాంగణంలో చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 72 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ పట్నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంఘం చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలతోపాటు చదువుపై విద్యార్థులకు ఆసక్తి కనబరిచే విధంగా పలు అంశాలను చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు మంచి ఆసక్తిని కనబరచడం హర్షించదగ్గ విషయమన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతగా ప్రముఖ కళాకారుడు మానిక్యరావు మాస్టారు వ్యవహరించగా సంఘం కార్యదర్శి మహేష్ పట్నాయక్, సాంస్కృతిక కార్యదర్శి బాలకృష్ణ పట్నాయక్, కొండవలస కృష్ణమూర్తి పట్నాయక్, జనార్దన్ పట్నాయక్, గజలక్ష్మీపట్నాయక్, గిరీష్ పట్నాయక్ తదితరులు పోటీలను పర్యవేక్షించారు. విజేతలకు పంద్రాగస్టు రోజున బహుమతులు అందజేయనున్నట్లు కార్యదర్శి మహేష్ పట్నాయక్ తెలియజేశారు.


