వజ్రపుకొత్తూరు రూరల్: మందస మండలం వీరభద్ర గ్రామంలో జూలై 31న జరిగిన ఘటనలో ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి చేయించిన కుమారు డు ఇప్పిలి వివేక్ను పోలీసులు అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ తెలిపిన వివరాలు మేరకు.. 31వ తేదీ రాత్రి వీరభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి రాఘవరావు తన భార్యతో కలిసి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వచ్చా రు. ఇంటి గేటు వద్ద రాఘవరావు వాహనంపై కూర్చొని ఉండగా ఆయన భార్య ఇప్పిలి స్వర్ణలత ఇంటి గేటు తీస్తున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రాఘవరావుపై దాడి చేశారు. భర్తపై జరుగుతున్న దాడిని గమనించిన స్వర్ణలత తన భర్తపై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించగా నిందితులు ఆమెను భయపెట్టి పక్కను నెట్టేసి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై అదే రోజు రాత్రి మందస పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఆగస్టు 8న మందస పోలీసు స్టేషన్ ఎస్ఐ, సిబ్బంది హరిపురం గ్రామంలో గల ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడిందన్నారు. ఫిర్యాదుదారుడితో కుమారుడు ఇప్పిలి వివేక్కు గతంలో గొడవలు ఉన్న నేపథ్యంలో సుపారీ గ్యాంగ్తో ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులైన మందస మండలం మకరజోల గ్రామానికి చెందిన యానాది జ్యోతిరాజు, పలాస మున్సిపాలిటీ లేబర్ కాలనీకి చెందిన చీకటి అభిరామ్, వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన గురుబిల్లి అనిల్ కుమార్తో పాటు తల్లిదండ్రులపై దాడికి ప్రేరేపించిన ఇప్పిలి వివేక్లను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్కు తరలించినట్లు మీడియా సమావేశంలో ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆమెతో పాటు కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు ఉన్నారు.


