జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వాణిజ్య దినోత్సవాన్ని మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో కామర్స్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్నాతకోత్తర వాణిజ్య విభాగ అధికారి డాక్టర్ దేవ దత్త ఇండోరియ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య విద్య ప్రాముఖ్యత, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, నైతిక వ్యాపారాల విలువలపై వివరించారు. వర్సిటీ వాణిజ్య విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ సచిన్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక రంగం స్థిరమైన వృద్ధి, పారిశ్రామికీకరణ, ఆర్థిక సమ్మిళతంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. విద్యార్థుల్లో వాణిజ్య విద్య ప్రాధాన్యత గుర్తించే అవకాశం, తమ ప్రతిభను ప్రదర్శించటానికి, ఆలోచనలు పెంచుకోవటానికి, వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, అకౌంటింగ్, మార్కెటింగ్, పన్నుల వ్యవస్థ, డిజిటల్ వాణిజ్య రంగంలోని కొత్త పోకడల గురించి తెలుసుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో వాణిజ్యం జాతీయ అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఆర్థికవృద్ధి మొదలగు వాటిపై విద్యార్థులతో చర్చించారు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు వాణిజ్య అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు సుశాంత కుమార్ సాహు, జి.మౌనిక, డాక్టర్ మర్శీ మౌసిమ టక్రీ, సొనాళీ భోయ్ పాల్గొన్నారు.


